ఉద్యోగిని దుస్తులు మార్చుకుంటుండగా రహస్య చిత్రీకరణ!

15 Nov, 2018 11:14 IST|Sakshi

రామచంద్రపురం రైల్వే స్టేషన్‌ సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

రామచంద్రపురం: రైల్వే స్టేషన్‌లోని ఓ గదిలో తోటి ఉద్యోగిని దుస్తులు మార్చుకుంటుండగా రహస్య కెమెరాతో చిత్రీకరించిన ఓ సూపరింటెండెంట్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం రైల్వే స్టేషన్‌లో మహ్మద్‌ రియాజ్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇదే స్టేషన్‌లో ఓ వివాహిత గేట్‌కీపర్‌గా సుమారు  ఏడాది నుంచి విధులు నిర్వహిస్తోంది. ఇటీవల స్టేషన్‌లో రిజర్వేషన్‌ కౌంటర్‌ ఎత్తివేయడంతో ఆ గదిలో మహిళా ఉద్యోగి దుస్తులు మార్చుకుని యూనిఫాం వేసుకుంటోంది. ఇది గమనించిన రియాజ్‌ గదిలోని ఓ ప్రదేశంలో రహస్య కెమెరాను అమర్చి చిత్రీకరణకు పాల్పడ్డాడు.

గత కొంతకాలంగా ఈ తతంగం సాగుతుండగా బుధవారం గదిలో దుస్తులు మార్చుకుంటున్న సమయంలో కెమెరాకు ఉన్న చిన్న ఎల్‌ఈడీ బల్బు వెలుగు కనిపించడంతో అనుమానం వచ్చి తీసి చూడగా అసలు విషయం బయటపడింది. సూపరింటెండెంట్‌ ల్యాప్‌టాప్‌లో కెమెరాలో చిత్రీకరించిన వీడియోలను గుర్తించిన బాధితురాలు పైఅధికారులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌ తన సిబ్బందితో రామచంద్రపురం రైల్వే స్టేషన్‌కు చేరుకొని రహస్య చిత్రీకరణను నిర్ధారించారు. కెమెరాను, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసి రైల్వే డీఆర్‌ఎంకు నివేదిక అందించారు. డీఆర్‌ఎం ఆదేశాల మేరకు నిందితుడు మహ్మద్‌ రియాజ్‌ను సస్పెండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు