బాబు కోరితే భద్రత పెంచుతాం: మంత్రి సుచరిత

19 Feb, 2020 20:54 IST|Sakshi

సాక్షి, గుంటూరు: తనకు భద్రత తగ్గించారని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. చంద్రబాబు భద్రతలో ఎలాంటి మార్పులు చేయలేదని, ఒక్కరిని కూడా తగ్గించలేదని స్పష్టం చేశారు. ఆర్నెళ్లకొకసారి ఇలాంటి ఆరోపణలు చేయటం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. ప్రజల్లో సానుభూతి కోసం ఇలాంటి చవకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన వ్యక్తిగత మాజీ కార్యదర్శి ఇంట్లో జరిగిన ఆదాయపన్ను శాఖ జరిపిన సోదాల గురించి మాట్లాడరు గానీ ఇలాంటి ఆరోపణలు మాత్రం చేస్తుంటారని చురక అంటించారు. చంద్రబాబు కోరితే ఆయనకు మరింత భద్రతను పెంచటానికి సిద్ధమని హోంమంత్రి ప్రకటించారు. (చదవండి: ఐటీ గుప్పిట్లో బిగ్‌బాస్‌ గుట్టు!)

183 మందితో చంద్రబాబుకు భత్రత: డీజీపీ
దేశంలో అత్యంత ఎక్కువగా చంద్రబాబుకు భద్రత కల్పిస్తున్నామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. ప్రస్తుతం జడ్‌ప్లస్‌ కేటగిరి కింద సెక్యురిటీ ఇస్తున్నట్టు చెప్పారు. మొత్తం 183 మందితో ఆయనకు భద్రత ఏర్పాటు చేశామన్నారు. విజయవాడలో 135 మంది, హైదరాబాద్‌లో 48 మందితో భద్రత కల్పిస్తున్నట్టు తెలిపారు. (చదవండి: చంద్రబాబూ.. ఏంటయ్యా నీ బాధ?)

మరిన్ని వార్తలు