తిరుమలలో భద్రతా వైఫల్యం

20 Jan, 2019 08:13 IST|Sakshi

తాళం పగలుగొట్టి ఆలయంలోకి చొరబడ్డ భక్తులు

తిరుమల : నిరంతర నిఘా వుండే తిరుమలలో భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. క్యూకాంప్లెక్స్‌లోని గేట్లను పగలగొట్టి ముగ్గురు వ్యక్తులు శనివారం అక్రమంగా శ్రీవారి దర్శనానికి ఆలయంలోకి ప్రవేశించారు.
ఆలయంలో విధుల్లో వున్న టీటీడి సిబ్బంది వారిని అడ్డగించి భద్రతా సిబ్బందికి అప్పగించారు. శ్రీవారి దర్శనార్థం మహారాష్ట్ర లోని పుణేకు చెందిన 15 మంది భక్తులు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌కు చేరుకున్నారు.

రద్దీ నేపథ్యంలో క్యూలైన్లు నిండిపోవడంతో వీరు క్యూకాంప్లెక్స్‌కు వెలుపల ఏర్పాటు చేసిన క్యూలైన్‌లోకి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి క్యూకాంప్లెక్స్‌ లోని కంపార్ట్‌మెంట్లలోకి చేరుకున్నారు. ఇందులో 12మంది శ్రీవారి దర్శనం కోసం వేచివుండగా...ముగ్గురు మాత్రం కంపార్టుమెంట్‌ నుంచి బయటకు వచ్చారు. అడ్డదారి గుండా ఆలయంలోకి వెళ్ళేందుకు ప్రయత్నించి ఎలిఫెంట్‌ గేట్‌ వద్ద వున్న గేట్‌ తాళాలను పగలగొట్టారు. వేకువజామున శ్రీవారి సుప్రభాతసేవ జరిగే సమయంలో మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు