కొప్పుల రాజుపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫైర్

21 Jan, 2014 14:59 IST|Sakshi
కొప్పుల రాజుపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫైర్

విశ్రాంత ఐఏఎస్ అధికారి, ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజుపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానాన్ని కొప్పుల రాజు తప్పుదారి పట్టించాడని వారు ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల బరిలో ఉన్న కొప్పుల రాజును ఓడించేందుకు ఇప్పటికే సిద్ధమైనట్లు తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చే కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యనేతలను రాజ్యసభ బరిలోకి దింపేందుకు తామ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు వివరించారు.

 

దీని ద్వారా విభజనపై దూసుకు వెళ్తున్న కాంగ్రెస్కు షాక్ ఇస్తామన్నారు. రాజ్యసభ సభ్యులుగా హై కమాండ్ ప్రతిపాదించిన అభ్యర్థులు తప్ప ఎవరు పోటీ చేసిన తాము సంపూర్ణ మద్దతిస్తామని స్పష్టం చేశారు. రాజ్యసభకు కొప్పుల రాజును ఎన్నిక చేసేందుకు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. దాంతో సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొప్పుల రాజులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు