డివైడర్‌ను ఎక్కి..లారీని ఢీకొట్టిన కారు

4 Nov, 2018 07:43 IST|Sakshi

ఏడేళ్ల బాలుడి దుర్మరణం

నలుగురికి గాయాలు

ఒంగోలు /ఉలవపాడు: వేగంగా వెళ్తున్న కారు టైరు పంక్చరై డివైడర్‌ ఎక్కి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఏడేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జాతీయ రహదారిపై మండల పరిధిలో మన్నేటికోట అడ్డ రోడ్డు వద్ద శనివారం జరిగింది. అందిన వివరాల ప్రకారం.. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. తండ్రి జ్ఞాపకార్థం కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నుంచి కారులో స్వగ్రామం బుచ్చిరెడ్డిపాలేనికి  బయల్దేరారు. కారులో రంజిత్‌ తన భార్య ప్రత్యూష, æకుమారుడు హృతిక్‌ (7), కుమార్తె బుజ్జితో పాటు పనిమనిషి శ్రావణితో కలిసి వస్తున్నారు.

 మన్నేటికోట వద్ద కారు డివైడర్‌ను ఢీకొని కావలి నుంచి ఒంగోలు వైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. ముందు కూర్చొని ఉన్న ఏడేళ్ల హృతిక్‌ కారు అద్దం నుంచి బయటకు వచ్చి లారీ ముందు భాగాన్ని గుద్దుకుని రోడ్డుపై పడిపోయాడు. తలపై బలమైన గాయం కావడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన వారు సీట్‌ బెల్టు పెట్టుకోవడంతో కారులోనే ఉండిపోయారు. ప్రత్యూష, రంజిత్, శ్రావణి, బుజ్జిలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సిబ్బంది రిమ్స్‌కు తరలించారు. కారు ముందు భాగం లారీకి ఇరుక్కుపోయింది. ప్రమాద స్థలాన్ని స్థానిక పోలీసులు, హైవే మొబైల్, రోడ్‌ సేఫ్టీ సిబ్బంది పరిశీలించి ట్రాఫిక్‌ సమస్య లేకుండా చేశారు. స్టేషన్‌ ఇన్‌చార్జి అన్వేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు