సాక్షి, అనంతపురం: టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ విమర్శించారు. జిల్లాలో సోమవారం నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేదని తెలిపారు. చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరని, తనకు పునరావాస కేంద్రం కావాలనడంపై మండిపడ్డారు. జిల్లాలో మాజీమంత్రి పరిటాల సునీత ఆగడాలు మితిమీరి పోయాయన్నారు. నసనకోటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై విచక్షణా రహితంగా పరిటాల వర్గీయులు దాడి చేశారని మండిపడ్డారు.
రాజకీయ హింసను ప్రోత్సహించే సంస్కృతి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి లేదని స్పష్టం చేశారు. ఓ వైపు హింసా రాజకీయాలు చేస్తూ మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురద చల్లటం టీడీపీ మానుకోవాలని హెచ్చరించారు. టీడీపీ గూండాలపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. సీఎం జగన్ వంద రోజుల పాలన చూసి టీడీపీ భయపడుతోందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతుంటే చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని శంకరనారాయణ దుయ్యబట్టారు.