సువర్ణయుగానికి మీ ఓటే నాంది : షర్మిల

22 Jul, 2013 05:01 IST|Sakshi
సువర్ణయుగానికి మీ ఓటే నాంది : షర్మిల

- మరోప్రజాప్రస్థానంలో ప్రజలకు షర్మిల పిలుపు
- రాజన్న కలలను జగనన్న సాకారం చేస్తాడు
- ప్రస్తుతం నడుస్తున్న రాక్షస పాలనకు చరమగీతం పాడండి
- ప్రజావ్యతిరేక కాంగ్రెస్, టీడీపీలకు తగిన బుద్ధి చెప్పండి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి
- శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించిన పాదయాత్ర

 ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు ఒక స్వర్ణయుగంలా సాగింది. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినా ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం వేయకుండా కన్నతండ్రిలా పాలించారు. మళ్లీ ఆ సువర్ణయుగం రావడానికి మీ ఓటే నాంది కావాలి. రాజన్న రాజ్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కలలను జగనన్న సాకారం చేస్తాడు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల ఉద్ఘాటించారు. ప్రస్తుతం నడుస్తున్న రాక్షస, రాబందుల పాలనకు చరమగీతం పాడి ఈ ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రజాసమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం విజయనగరం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించింది. పాదయాత్ర ఆసాంతం వర్షంలోనే సాగింది. వానలో తడుస్తూనే షర్మిల ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తడిసిముద్దయినా లెక్క చేయకుండా పెద్దసంఖ్యలో మహిళలు, యువకులు, వృద్ధులు దారిపొడవునా షర్మిలకు స్వాగతం పలికారు. వీరఘట్టం మండలం కడకెల్ల గ్రామంలో జరిగిన సభలో షర్మిల మాట్లాడారు. ప్రసంగం సారాంశం ఆమె మాటల్లోనే...
రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందాం..

‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనలో ఎన్నో అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు జలయజ్ఞం.. రైతులను ఆదుకునేందుకు 7 గంటల ఉచిత విద్యుత్తు.. రైతులకు, మహిళలకు పావలా వడ్డీకే రుణాలు.. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్.. ఆరోగ్యశ్రీ.. ఫోన్ చేయగానే కుయ్‌కుయ్ అంటూ వచ్చే 108, 104.. ఇలా ఎన్నో పథకాలను అద్భుతంగా అమలు చేశారు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ప్రజలపై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడకూడదని ఎలాంటి చార్జీలు పెంచలేదు. పన్నులు వేయలేదు. కానీ వైఎస్ వెళ్లిపోయిన తర్వాత ఆయన పథకాలను తుంగలోకి తొక్కారు. అడ్డగోలుగా అన్నింటిపై చార్జీలు పెంచేశారు. ఇప్పుడు రాక్షస రాజ్యం.. రాబందుల రాజ్యం నడుస్తోంది.

ఈ ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి, దానితో కుమ్మక్కైన తెలుగుదేశం పార్టీకి సమయం వచ్చినప్పుడు గట్టిగా బుద్ధి చెప్పండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం వస్తుంది. రాజన్న ఇచ్చిన ప్రతి మాటను జగనన్న నిలబెడతాడు. ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలన్న రాజన్న కలను నెరవేరుస్తాడు. రాష్ట్రంలో గుడిసె అనేదే లేకుండా ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు ఉండాలన్న రాజన్న ఆశయాన్ని నెరవేరుస్తాడు. జగనన్న సీఎం అయ్యాక మహిళలకు, రైతులకు వడ్డీ లేకుండానే రుణాలు అందుతాయి. రైతు తన పంటను నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. వృద్ధులకు, వితంతువులకు రూ.700 పింఛన్ అందుతుంది.

వికలాంగులకు పెన్షన్ రూ.1,000 అవుతుంది. వైఎస్సార్ అమ్మ ఒడి పథకం ద్వారా కుటుంబంలో ఇద్దరు పిల్లలకు పదో తరగతి వరకు ప్రతినెలా రూ.500 నేరుగా అమ్మ ఖాతాలోనే పడతాయి. ఇంటర్మీడియెట్‌కు అయితే రూ.700, డిగ్రీ చదువులకైతే రూ.1,000 అమ్మ ఖాతాలోనే జమవుతాయి. ఈ స్థానిక ఎన్నికలు, రాబోయే జనరల్ ఎన్నికల్లో మీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినప్పుడు, జగనన్న ముఖ్యమంత్రి అయినప్పుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినప్పుడు ఆ సువర్ణ యుగం మళ్లీ వస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్‌కు మీరు వేసే ప్రతీ ఓటు జగనన్న నిర్దోషి అని మీరు నమ్ముతున్నారని చాటి చెబుతుంది’’

13.8 కిలోమీటర్ల పాదయాత్ర..: ఆదివారం 216వ రోజు పాదయాత్ర విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ప్రారంభమై శ్రీకాకుళం జిల్లా విక్రమపురం సమీపంలో ముగిసింది. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం సంతోషపురంలో ప్రారంభమై ఖడ్గవలస, నాగూరు, చిలకాం క్రాస్ రోడ్డు, కార్యవలస, రావివలస మీదుగా శ్రీకాకుళం జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించింది. అనంతరం కడకెల్ల, నడిమికెల్ల, విక్రమపురం మీదుగా చిట్టపుడివలస వద్ద ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల చేరుకున్నారు.

ఆదివారం 13.8 కి.మీ. నడిచారు. పాదయాత్రలో పాల్గొన్నవారిలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, పాలవలస రాజశేఖరం, కణితి విశ్వనాథం, తాజా మాజీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, పిరియా సాయిరాజ్, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ సుజయ్‌కృష్ణ రంగారావు, పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు, పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు వరుదు కల్యాణి, పార్టీ నాయకులు ప్రసాదరెడ్డి, భూపతిరాజు శ్రీనివాసరాజు, పి.విక్రాంత్, విశ్వసరాయి కళావతి, పీఎంజే బాబు, కలమట వెంకటరమణ, వై.వి.సూర్యనారాయణ, వజ్జ బాబూరావు, గొర్లె కిరణ్‌కుమార్, దుప్పల రవీంద్ర, హనుమంతు కిరణ్‌కుమార్, బొడ్డేపల్లి పద్మజ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్ పథకాలు అందడం లేదమ్మా..
శ్రీకాకుళం జిల్లా కడకెల్లలో మహిళలు షర్మిలతో తమ కష్టాలను చెప్పుకున్నారు. వితంతు పింఛన్లు మంజూరు చేయడం లేదని గోడు వెల్లబోసుకున్నారు. ‘వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదమ్మా..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు షర్మిల.. అధైర్యపడవద్దని, త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని వారికి భరోసానిచ్చారు. కడకెల్ల, నడిమికెల్ల, విక్రమపురం గ్రామాల్లో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తున్నామని మహిళలు చెప్పడంతో షర్మిల ఆనందం వ్యక్తం చేశారు. ‘‘మీ స్ఫూర్తి రాష్ర్ట మహిళా లోకానికి ఆదర్శం..’’ అని వారిని కొనియాడారు.

మరిన్ని వార్తలు