అక్కడ పొత్తంటా.. ఇక్కడ చాలెంజంటా?

19 Sep, 2018 09:28 IST|Sakshi

టీడీపీ తీరుపై ధ్వజమెత్తిన శిల్పా చక్రపాణిరెడ్డి 

సీఎం చంద్రబాబు పచ్చిమోసకారి అని విమర్శ 

నవరత్నాలతోనే అభివృద్ధి సాధ్యమని వెల్లడి 

నంద్యాల: తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని, ఆంధ్రాలో చాలెంజ్‌ అంటూ సీఎం చంద్రబాబు రాజకీయ డ్రామాలాడుతున్నారని వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి ధ్వజమెత్తారు.  రాష్ట్రాన్ని రెం డుగా చీల్చిన కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని ప్రజలు సహించరని, చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నంద్యాల పద్మావతినగర్‌లోనిపార్టీ కార్యాలయంలో మంగళ వారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నెట్టుకొచ్చిన ఆయన ఇప్పుడు మాయ మాటలు చెబుతూ మరోసారి జనాన్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆయన మాటలు నమ్మకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీని భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపుని చ్చారు. 

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కంటితుడుపు చర్యగా నిరుద్యోగ భృతి కింద రూ.1000 ప్రకటించారన్నారు. సమస్యలు తీర్చాలంటూ ప్లకార్డులు ప్రదర్శించిన ముస్లిం యువకులపై దేశ ద్రోహం కేసు పెట్టిన ఘన చరిత్ర చంద్రబాబుదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీరున్నా జిల్లా అవసరాలకు వాడుకునే అవకాశం లేకుండా ఇతర జిల్లాలకు తరలిస్తున్నార న్నారు. శ్రీశైలంలో కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ను రెగ్యులర్‌ చేస్తానని చెప్పి చేయలేదని, నిర్వాసితులకు ఇళ్లు కూడా కట్టించలేకపోయారన్నారు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో 24 సార్లు నోటీసులిచ్చినా స్పందిం చని చంద్రబా బుకు మహారాష్ట్ర కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ ఇచ్చిందని, అయితే ఈ పరిస్థితిని కూడా చంద్రబాబు తన రాజకీయపబ్బం గడుపుకోవడానికి వాడుకుంటున్నారని విమర్శించారు. 

‘కావాలి జగన్‌.. రావాలి జగన్‌’ను దిగ్విజయంగా పూర్తి చేద్దాం : వైఎస్సార్‌సీపీ చేపట్టిన రావాలి జగన్‌... కావాలి జగన్‌ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని పార్టీ నాయకులను శిల్పా చక్రపాణిరెడ్డి కోరారు. కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్ని ఊర్లలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పేరుతో ప్రకటించిన పథకాలతో ఒక్కో కుటుంబానికి రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని, ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. పార్టీ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి,  రాష్ట్ర బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోగోలు శివశంకర్‌నాయుడు, నాయకులు రమణారెడ్డి, పుల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి, మహేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు