వైఎస్సార్‌ సీపీలో చేరిన శిల్పామోహన్‌ రెడ్డి

14 Jun, 2017 11:46 IST|Sakshi

హైదరాబాద్‌: మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి బుధవారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. లోటస్‌ పాండ్‌లో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో తన మద్దతుదారులతో కలిసి వైఎస్సార్‌ సీపీలోకి వచ్చారు. పార్టీ కండువా వేసి జగన్‌ సాదర స్వాగతం పలికారు.

నంద్యాల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దేశం సులోచన, మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి, పార్టీ నేతలు గోస్పాడు ప్రహ్లాదరెడ్డి, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, ఆదిరెడ్డితో సహా కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. వీరందరినీ పేరు పేరును జగన్‌కు శిల్పామోహన్‌రెడ్డి పరిచయం చేశారు. శిల్పామోహన్‌రెడ్డి మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది.

శిల్పామోహన్‌రెడ్డి చేరికను కర్నూలు జిల్లా వైఎస్సార్‌ సీపీ నేతలు స్వాగతించారు. శిల్పామోహన్‌రెడ్డి లాంటి బలమైన నేత తమ పార్టీలో చేరడం లాభిస్తుందని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ఇంకా చాలా మంది నాయకులు తమ పార్టీలో చేరతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని చెప్పారు. రాబోయే రోజుల్లో తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందని, వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోని వస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.