సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభా నియోజకవర్గానికి త్వరలో జరుగనున్న ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్రెడ్డిని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదివారం అధికారికంగా ఒక ప్రకటన వెలువడింది. 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన భూమా నాగిరెడ్డి ఆ తరువాత టీడీపీలోకి ఫిరాయించారు.
కొంత కాలానికి ఆయన మరణించడంతో నంద్యాల స్థానానికి ఉప ఎన్నిక అవసరమవుతున్నది. ఈ స్థానాన్ని తిరిగి ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న దృఢ నిశ్చయంతో ఉన్న జగన్ ఇటీవలే పార్టీలో చేరిన శిల్పా మోహన్రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. నంద్యాల వైఎస్సార్ కాంగ్రెస్ సమన్వయకర్తగా కూడా శిల్పాను జగన్ నియమించారు. పార్టీలోని సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపిన దరిమిలా జగన్ శిల్పా పేరును ప్రకటించారు.