బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం
వైఎస్ జగన్ను కలిసిన ముస్లిం యువకులు, శిల్పా రవి
నంద్యాల: ముస్లిం మైనార్టీలకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, వారికి ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసినా స్పందిస్తామని ఆ పార్టీ నంద్యాల నియోజకవర్గ నేత శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి అన్నారు. బుధవారం విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని శిల్పా రవి నంద్యాల ముస్లిం యువకులతో పాటు కలిశారు. ఈ సందర్భంగా గుంటూరులో పోలీసుల నిర్బంధం గురించి వివరించారు. అనంతరం శిల్పా రవి ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడారు. ముస్లిం యువకులపై చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులపై వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారన్నారు. వారికి అండగా ఉంటామని, అలాగే ముస్లిం మైనార్టీల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తామని చెప్పారన్నారు. నాలుగేళ్లుగా ముస్లింల కోసం ఏమీ చేయని చంద్రబాబు ఇప్పటికైనా సమస్యలు తీరుస్తారేమోనన్న ఆశతో ‘నారా హమారా’ సదస్సుకు వెళ్లి ప్లకార్డులు చూపించామే తప్ప తాము ఎలాంటి అల్లర్లూ చేయలేదని ముస్లిం యువకులు జగన్కు వివరించారని తెలిపారు.
నాలుగున్నరేళ్లు అవుతున్నా ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం, న్యాయం చేయాలని కోరడం తప్పు ఎలా అవుతుందని, ప్లకార్డులు ప్రదర్శించామనే అక్కసుతోనే తమపై దేశద్రోహం కేసు పెట్టి హింసించారని తెలిపారన్నారు. వైఎస్సార్సీపీ అన్ని విధాల అండగా ఉంటుందని, మీరేం భయపడవద్దని జగన్ భరోసా ఇచ్చినట్లు చెప్పారు. రాజ్యాంగానికి లోబడి ప్లకార్డులు ప్రదర్శించిన వారిపై దేశద్రోహం కేసుపెట్టిన చంద్రబాబే నిజమైన ఉగ్రవాది అని శిల్పా రవి విమర్శించారు. చంద్రబాబుకు ముస్లింలపై ఏనాడే ప్రేమలేదన్నారు. మూడుసార్లు బీజేపీతో జత కట్టి మైనార్టీలను అణచివేశారని గుర్తు చేశారు. ముస్లిం మంత్రి లేకుండా పాలన చేస్తున్న చంద్రబాబుకు ఆ వర్గాల ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ముస్లిం యువకులపై పెట్టిన తప్పుడు కేసులపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశామని, వీటిని ఎత్తివేయాలంటూ హైకోర్టుకు కూడా వెళ్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హబీబుల్లా, నంద్యాల పార్లమెంటరీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పీపీ మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.