రాజమండ్రి క్రైం : ఒక కేసు విషయంలో బాధ్యులను చేస్తూ ఒక ఎస్సై, ఒక రైటర్ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఏప్రిల్ 22 రాత్రి ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి గోదావరి గట్టు మీదుగా ఇంటికి వెళుతున్న బీజేపీ నాయకుడు దారపురెడ్డి ప్రసాదరెడ్డికి అనుమానాస్పదంగా ఒక లారీ కనిపించింది. ఆ విషయాన్ని సమీపంలోని టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఏం చేస్తారా అని తన సెల్ఫోన్లో వీడియో కూడా తీశాడు. అక్కడకు వచ్చిన కానిస్టేబుళ్లు.. ఏదో ఒత్తిడి కారణంగా లారీని వదిలేశారంటూ ప్రసాదరెడ్డి టూ టౌన్ పోలీసుస్టేషన్లో అదే పోలీసులపై ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకుడు ఒకరు రంగ ప్రవేశం చేసి ప్రసాదరెడ్డిని పోలీసుల ఎదుటే కొట్టాడు. అడ్డుకోకుండా పోలీసులు సహకరించారంటూ బీజేపీ నాయకులు అప్పట్లో ఆందోళన చేశారు. దర్యాప్తు చేసిన ఉన్నతాధికారులు ఎస్సై శంకర్, రైటర్ శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.