ఎస్సై అనుచిత ప్రవర్తన - పరిస్థితి ఉద్రిక్తం

5 Oct, 2015 19:19 IST|Sakshi

ప్రయాణికుల కోసం బస్సు ఆపి.. పక్కన టీ తాగుతున్న కండక్టర్‌పై దురుసుగా ప్రవర్తించిన ఎస్సైపై ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం ప్రాంతంలో కృష్ణా జిల్లా బంటుమిల్లిలో చోటుచేసుకుంది.

బంటుమిల్లి నుంచి మచిలీపట్నం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు బంటుమిల్లి ప్రధాన సెంటర్‌లో రోడ్డు పక్కన ఆపి ఉంది. బస్సు కండక్టర్ పక్కనే ఉన్న హోట్‌లో టీ తాగుతున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన స్థానిక ఎస్సై పి.వాసు బస్సు ఆగి ఉండటాన్ని గమనించి కండక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కళాశాల విద్యార్థులు వచ్చే టైం అయిందని, ఐదు నిమిషాలు ఆగితే వెళ్లిపోతామని కండక్టర్ నచ్చజెప్పారు. ఇదేమీ పట్టించుకోని ఎస్సై.. కండక్టర్ చొక్కా పట్టుకుని అసభ్యంగా దూషిస్తూ ఆయన చేతిలో ఉన్న టికెట్ల యంత్రాన్ని (టిమ్స్) లాక్కుని వెళ్లాడు.

పరిస్థితి గమనించిన ప్రయాణీకులు ఎస్సై తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన ఆర్టీసీ యూనియన్ నేతలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.



 

>
మరిన్ని వార్తలు