విజయమ్మ దీక్షకు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల మద్దతు

17 Aug, 2013 03:02 IST|Sakshi

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈ నెల 19 నుంచి విజయవాడలో చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతున్నట్లు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రకటించింది. ఫోరం సభ్యులు శుక్రవారమిక్కడ విజయమ్మను ఆమె నివాసంలో కలిశారు. అనంతరం ఫోరం చైర్మన్ డి.మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల సీమాంధ్ర ప్రాంతానికి తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. అందుకే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులమంతా ఐక్యంగా పదిహేను రోజులుగా వివిధ రూపాల్లో ఉద్యమిస్తున్నామన్నారు. సచివాలయంలో తాము చేపట్టిన నిరసన కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపినందుకు విజయమ్మకు కృతజ్ఞతలు తెలిపామన్నారు. కేంద్రం విభజన నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు తాము చేపట్టబోయే కార్యక్రమాలకు వైఎస్సార్‌సీపీ మద్దతివ్వాలని కోరామని, అందుకు ఆమె సానుకూలంగా స్పందించారని చెప్పారు.

ఈ సమావేశంలో పార్టీ నేతలు డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి, భూమా శోభానాగిరెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కో-చైర్మన్ డి.మురళీ మోహన్, సి.హరీష్ కుమార్‌రెడ్డి, సమన్వయకర్త ఎ.రవీందర్‌రావు, కార్యదర్శి కేవీ కృష్టయ్య, కన్వీనర్ టి.వెంకట సుబ్బయ్య, కో-కన్వీనర్ బెన్సన్, హౌసింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు వెంకట్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు