ఐటీ జోన్‌లో సింగపూర్ సోకులు

18 Oct, 2013 00:00 IST|Sakshi

 రాయదుర్గం,న్యూస్‌లైన్:
 ఐటీజోన్‌కు మరో మణిహారం..ఇప్పటికే అభివృద్ధిలో దూసుకెళ్తున్న ఈ ప్రాంతంలో సింగపూర్ దేశంలో మాదిరి ఫుట్‌ఓవర్‌బ్రిడ్జీ(ఎఫ్‌వోబీ)లను నిర్మించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 5 వంతెనలను నిర్మించనుండగా..నానక్‌రాంగూడ ఐటీజోన్ పరిధిలో రెండు, మాదాపూర్ ఐటీజోన్‌లో మూ డింటిని నిర్మించేందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నారు. తొలివిడతలో నానక్‌రాంగూడ, మాదాపూర్‌లలో ఒక్కోటి చొప్పున నిర్మాణం చేయనున్నారు. నానక్‌రాంగూడలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)-ఇన్ఫోసిస్‌ల మధ్య నిర్మించే ఈ వంతెన పనులు గురువారం ప్రారంభమయ్యాయి. మాదాపూర్‌లో రహేజా ఐటీపార్కు వద్ద రెండోదాని పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ)ప్రకాశ్ ఆర్ట్స్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం వీటి నిర్మాణం చేయడంతోపాటు నిర్వహణను కూడా చూస్తుందని అధికారులు తెలిపారు.
 అత్యాధునిక సౌకర్యాలతో వంతెన: ఐటీజోన్‌లో నిర్మించే ఫుట్‌ఓవర్ బ్రిడ్జీలను సింగపూర్‌లోని వంతెనల తరహాలో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీఐఐసీ అధికారులు సూత్రప్రాయంగా చెప్పారు.
 
  సింగపూర్‌లో ఎఫ్‌వోబీకి మెట్ల స్థానంలో ఇరువైపులా ఎస్క్‌లేటర్లు ఉంటాయి. దీంతోపాటు ఆధునిక లైటింగ్ విధానం, సీసీ కెమెరాలను అమర్చుతారు. ఇటీవలకాలంలో ఐటీజోన్‌లో వాహనాల రద్దీ బాగా పెరిగినందున  పాదచారుల కోసం ఎఫ్‌వోబీల నిర్మాణాలు చేపట్టాలని తలపెట్టారు. ప్రతి ఎఫ్‌వోబీ ఉన్నచోట ఇరువైపులా ఏసీ బస్‌షెల్టర్ల నిర్మాణ పనులకు కూడా శ్రీకారం చుట్టారు.

>
మరిన్ని వార్తలు