నిద్రలోనే మృత్యు ఒడిలోకి..

1 Feb, 2015 10:59 IST|Sakshi

బనగానపల్లె: ఆటపాటలతో అల్లరి చేసే అ చిన్నారి నిద్రలోనే శాశ్వతంగా మృత్యు ఒడికి చేరింది. మిద్దె గోడ రాళ్లు కూలి మూడేళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన బనగానపల్లె  పట్టణం గౌండవీధిలో శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఇర్ఫాన్-మసరత్ దంపతుల కుమార్తె అయిన మర్జియా అతహర్(3) ఇంటిలో నిద్రిస్తుండగా గోడ మెత్తు ఒక భాగం బాలికపై కూలింది. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.

ఇంటి పక్క భాగంలో ఉన్న ఇళ్ల ప్లానింగ్ అధికారి మగ్బుల్ హుస్సేన్ నూతన ఇంటిని నిర్మించేందుకు తన పాత ఇల్లు తొలగింపు సమయంలో బీము కూల్చుతుండగా దాని చివరి భాగం ఇర్ఫాన్ ఇంటి గోడలోకి దూసుకుపోయింది. దీంతో ఈ ప్రమాదం జరిగింది. బీమును కూల్చుతున్న విషయం ముందు జాగ్రత్తగా తమకు తెలపాల్సిన అవసరం ఉందని, మృతి చెందిన బాలిక కుటుంబీకులు వాపోతున్నారు. ఇర్ఫాన్-మసరత్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక్క కుమార్తె. ఉన్న ఒక్క కుమార్తె మృతి చెందడం తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంతమయ్యారు. బనగాపల్లె ఎస్‌ఐ మంజునాథ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

వైఎస్సార్‌సీపీ కన్వీనర్ పరామర్శ..
బాలిక మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే బనగానపల్లె నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఇర్ఫాన్ ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఈ సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు.

మరిన్ని వార్తలు