త్రుటిలో తప్పింది..

31 May, 2018 08:09 IST|Sakshi
డిబ్రూఘర్‌– తాంబరం ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌4 బోగీ కింద నుంచి పొగలు గుర్తించిన ప్రాంతం

డిబ్రూఘర్‌–తాంబరం ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్ప

ఓ బోగీ నుంచి వచ్చిన పొగలు

గుర్తించి రైలు ప్రమాదాన్ని తప్పించిన సీటీఐ కేశవభట్ల

తూర్పు గోదావరి : బుధవారం..రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌..సమయం ఉదయం 9.45 గంటలుడిబ్రూఘర్‌ టౌన్‌ నుంచి తాంబరం వెళుతున్న 15930 నంబర్‌గల ఎక్స్‌ప్రెస్‌రైలు మొదటి ప్లాట్‌ఫాంపై ఆగింది.రైలు నిర్ణీతసమయంలో ప్లాట్‌ఫాం నుంచి విజయవాడవైపు బయల్దేరింది.ఆ సమయంలో సీటీఐ కార్యాయంలో విధులు నిర్వహిస్తున్న సీటీఐ కేశవభట్ల శ్రీనివాసరావు నడుస్తున్న రైలు ఏస్‌–4 బోగీ కింద నుంచి పొగలు రావడం గమనించారు. తక్షణమే అప్రమత్తమై స్టేషన్‌లోని డిప్యూటీ స్టేషన్‌ సూపరింటెండెంట్‌నాగేశ్వరరావుకు సమాచారం ఇచ్చారు.రైలును తక్షణమే నిలిపివేయించారు.

విషయం తెలుసుకున్న ట్రైన్‌ లైటింగ్, ఎలక్ట్రికల్‌ స్టాఫ్, ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. పొగలు వస్తున్న బ్యాటరీ గ్యారేజ్‌ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా పొగలు వచ్చాయని సకాలంలో గుర్తించడం వల్ల అగ్నిప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. రైలు ఇదే విధంగా మందుకు వెళితే విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ తో అగ్నిప్రమాదం సంభవించి ఉండేదని అధికారులు పేర్కొన్నారు. పొగలు వస్తున్న బ్యాటరీ వైర్లను తొలగించి రైలును విజయవాడ వైపు తరలించారు. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయమై సీటీఐ కేÔశవభట్ల శ్రీనివాసరావును వివరణ కోరగా బోగీ కింద నుంచి పొగలు రావడం చూస్తే ఇటీవల రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం గుర్తుకు వచ్చిందన్నారు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించానన్నారు. వారు తక్షణమే స్పందించి ఏవిధమైన ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారన్నారు. ఈ సందర్భంగా కేశవభట్లను స్టేషన్‌ సిబ్బంది అభినందించారు.

మరిన్ని వార్తలు