గురుకులాల ఉద్యోగులకు జీతాల్లేవ్!

9 Jul, 2014 03:50 IST|Sakshi

శ్రీకాకుళం కలెక్టరేట్: సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి జూన్ నెల జీతాలు ఇంతవరకు అందలేదు. సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీకే సంబంధిత ప్రిన్సిపాళ్లకు ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చుల నిధులు విడుదల చేసేవారు. జిల్లాలో 12 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 256 మంది వివిధ కేడర్ల ఉపాధ్యాయులు, 86 మంది ఉపాధ్యాయేతర సిబ్బంది పని చేస్తున్నారు. సగటున ఒక పాఠశాలకు జీతాలు, నిర్వహణ ఖర్చులకు నెలకు 8 నుంచి రూ. 10 లక్షల వరకు నెలకు అవసరమవుతుంది. 12 పాఠశాలలకు కలిపి రూ.1.20 కోట్లు చెల్లాంచాల్సి ఉంది.
 
 ఈ బడ్జెట్‌ను గత ప్రభుత్వాలు సకాలంలోనే చెక్కుల రూపంలో సంబంధిత ప్రిన్సిపాళ్లకు అందజేసేవారు. దీని ప్రకారం జూన్ జీతాల బిల్లు జూలై 1 నాటికి ప్రిన్సిపాళ్లకు చేరాలి. 2న సిబ్బందికి జీతాలు చెల్లించాలి. అయితే ఈ నెల అలా జరగలేదు. 8వ తేదీ దాటిపోయినా జీతాలు అందకపోవడంతో సిబ్బంది ఆందోళన చెం దుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో జాప్యం జరుగుతోం దని కొందరు అంటున్నారు.  ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగుల జీతాలు ఆలస్యం చేయబోమని ప్రభుత్వం ప్రకటించడంతోపా టు మిగిలిన అన్ని శాఖల ఉద్యోగులకు ఇప్పటికే జీతాల చెల్లింపులు దాదాపు పూర్తి అయ్యా యి. ఇదే విషయాన్ని గురుకుల కళాశాలల కో-ఆర్డినేటర్ చంద్రావతి వద్ద ప్రస్తావిం చగా ఈ నెల జీతాల నిధులు అందకపోవడం వాస్తవమేనన్నారు. అయితే ఎందుకు ఆలస్యమైందన్నదానికి కారణాలు తెలియవన్నారు.
 

మరిన్ని వార్తలు