సమాజంలో ఉపాధ్యాయులే కీలకం

22 Apr, 2018 11:48 IST|Sakshi
పత్తిపుత్తూరులో పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రోజా

వడమాలపేట : విద్యార్థులు ఏ రంగంలో  రాణించాలన్నా, సమాజం బాగుండాలన్నా గురువులే కీలకమని నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. శనివారం పత్తిపుత్తూరు జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో కొత్తగా నిర్మించిన అదనపు భవనాలను ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు పేదకుటుంబాల నుంచి వచ్చిన వారేనని, వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. అనంతరం ఆమె ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. భవనం శిథిలావస్థకు చేరుకుందని పాఠశాల పల్లంలో ఉండడం వల్ల వర్షం వస్తే నీళ్లు తరగతి గదులలోకి వస్తాయని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 
అంగన్‌వాడీలకు 200 కుర్చీల పంపిణీ..
మండలం గ్రాంట్‌ నుంచి 43 అంగన్‌వాడీ కేంద్రాలకు 200 కుర్చీలను శనివారం ఎమ్మెల్యే ఆర్‌కే రోజా పంపిణీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం కోసం వచ్చే గర్భిణులు, బాలింతలు కిందకూర్చుని భోజనం చేయడానికి పడుతున్న  ఇబ్బందులను గుర్తించే వీటిని మండల గ్రాంట్‌ నుంచి అందజేస్తున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ టీచర్ల డ్రస్‌కోడ్, పనితీరు బాగుందని కితాబిచ్చారు. 
చిన్నక్క మృతికి సంతాపం..
మండలంలోని పూడి గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు రామయ్య కుమార్తె చిన్నక్క మృతికి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా సంతాపం తెలిపారు. శనివారం ఆమె పూడి గ్రామానికి చేరుకుని చిన్నక్క మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.  కార్యక్రమాలలో ఎంపీపీ మురళీధర్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీలక్ష్మి, ఎంఈఓ పద్మావతి, సీడీపీఓ పద్మజారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు జైమునీంద్రులు, సూపర్‌వైజర్‌ తులసీ, పత్తిపుత్తూరు సర్పంచ్‌ ఆవుల ప్రతిమ, ఎంపీటీసీ రంగనాథం, నాయకులు సదాశివయ్య, సుబ్రమణ్యంయాదవ్, మధన్‌మోహన్‌రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, తులసీరామిరెడ్డి, హరిరెడ్డి, లోకేష్‌రెడ్డి, వెంకటరెడ్డి, రాజశేఖర్, నాగరాజు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు