హైదరాబాద్: ఐదు రోజుల క్రితం అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మానస రంజన్ స్వైన్(29) ఆచూకీ కోసం సైబరాబాద్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈనెల 18న ఉదయం 9 గంటలకు రైలు టికెట్ బుక్ చేసేందుకు వెళ్లిన రంజన్ అదృశ్యమైన విషయం తెలిసిందే. తొలుత మాదాపూర్లోని యాపిల్ హోం గెస్ట్హౌస్ నుంచి వెళ్లిన రంజన్ నేరుగా గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ కంపెనీకి వెళ్లారు. 15 నిమిషాల తరువాత కార్యాలయం నుంచి బయటకు వచ్చి సెల్ఫోన్ స్విచాఫ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.
ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత సెల్ నుంచి ఒక కాల్ చేసినట్టు, ఒక ఎస్ఎంఎస్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇతని ఆచూకీ కోసం సైబరాబాద్ పోలీసులు గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, సికింద్రాబాద్ ప్రాంతాలలోని గెస్ట్హౌస్లు, లాడ్జిలలో వాకబు చేస్తున్నారు. మరోవైపు రైలులో ఎక్కడికైనా వెళ్లారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. ఇతడి అదృశ్యానికి గల కారణాలపై కుటుంబ సభ్యులను ప్రశ్నించనున్నట్టు సమాచారం.