సోమశిలలో నీరు దుర్వినియోగం కాలేదు

19 Mar, 2016 03:53 IST|Sakshi
సోమశిలలో నీరు దుర్వినియోగం కాలేదు

 నెల్లూరు(పొగతోట): సోమశిల ప్రాజెక్ట్‌లో నీరు దుర్వినియోగం కాలేదని కలెక్టర్ జానకి పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. సోమశిల ప్రాజెక్ట్‌లో 26 టీఎంసీల నీరు దుర్వినియోగమైందని రైతు సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారని, ఈ విషయమై పత్రికల్లో వార్తలు సైతం ప్రచురితమయ్యాయని వివరించారు. రైతు సంఘాల నాయకులు సేకరించిన సమయంలో నీటి గణాంకాలు పూర్తి స్థాయిలో లేవన్నారు. ప్రాజెక్టుల్లో ఉన్న నీరు, విడుదల, వస్తున్న నీటి గణాంకాలను పూర్తిగా పరిశీలించారని చెప్పారు. 26 టీఎంసీల నీరు దుర్వినియోగం కాలేదని, ప్రాజెక్ట్‌లోనే నిల్వ ఉన్నాయని తెలిపారు. గతేడాది డిసెంబర్ 12న ఐఏబీ సమావేశం జరిగిందని, అప్పటికి జిల్లాలో 68.9 టీఎంసీల నీరు నిల్వ ఉందని రైతు సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారన్నారు.

ఐఏబీ నాటికి 67.862 టీఎంసీల నీరు నిల్వ ఉందని, గత నెల 20 నాటికి 18 టీఎంసీల నీరు ఇన్‌ఫ్లో ఉందని తెలిపారన్నారు. 3.918 టీఎంసీల నీరు మాత్రమే ఇన్‌ఫ్లో వచ్చిందని, కండలేరు రిజర్వాయర్‌కు 7.348 టీఎంసీల నీటిని విడుదల చేస్తే, మూడు టీఎంసీలనే విడుదల చేశారని నాయకులు తెలిపారన్నారు. ఇలాంటి తేడాల వల్ల 26 టీఎంసీల నీరు దుర్వినియోగమైందని రైతు సంఘాల నాయకులు భావిస్తున్నారని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే సోమశిల ప్రాజెక్ట్‌లో 33 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉందన్నారు.

నాయకులు చెప్పిన దానికి రికార్డులను పరిశీలిస్తే ఒక టీఎంసీ నీరు మాత్రమే తేడా వస్తోందని, ఇది  ఆవిరి, వృథా కిందపోయి ఉంటుందని తెలిపారు. నాయకులు ఫిర్యాదు చేసిన వెంటనే రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించామని పేర్కొన్నారు. 4.32 లక్షల ఎకరాలకు 43.7 టీఎంసీల సాగునీటిని విడుదల చేయాలని ఐఏబీలో తీర్మానించి నివేదికలను ప్రభుత్వానికి పంపి అనుమతితో నీటిని విడుదల చేశామని పేర్కొన్నారు. సోమశిల ప్రాజెక్ట్‌లో ఈఈ 3.2 టీఎంసీల నీటిని గణాంకాల్లో తక్కువగా నమోదు చేశారని చెప్పా రు.

మరిన్ని వార్తలు