ఏమీ పదాలు.. విచిత్రమముగానున్నవే..

8 Aug, 2019 10:48 IST|Sakshi

రెవెన్యూలో కొనసాగుతున్న వందేళ్ల నాటి పద బంధాలు

అరబ్, పారశీ, ఆంగ్ల పదాలనే రికార్డుల్లో వినియోగిస్తున్న రెవెన్యూ శాఖ

ఆ పదాలకు అంతరార్థం బోధపడక ప్రజల్లో అయోమయం

సాక్షి, దర్శి (ప్రకాశం): రెవెన్యూ.. భూ పరిపాలన వ్యవహారాలు చూసే అతి ముఖ్యమైన వ్యవస్థ. మిగిలిన ప్రభుత్వ శాఖల మాదిరిగా కాకుండా రెవెన్యూ శాఖకు ఓ విశిష్టత ఉంది. వందేళ్ల క్రితం బ్రిటిష్‌ హయాలో నిర్దేశించిన చట్టాలకు లోబడి ఇంకా రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తోంది. వాడుకలో ఉన్న రెవెన్యూ పద బంధాలు అన్నీ దాదాపు ఆంగ్లంలోనే ఉంటాయి. భారత్‌ను బ్రిటిష్‌ పాలకులకు ముందు మొఘలాయిలు పాలించే వారు. అప్పట్లో పారశీ, అరబ్‌ పదాలు చలామణిలో ఉండేవి. బ్రిటిషర్లు తమ ఆంగ్ల పదాలతోపాటు పారశీ, అరబ్‌ పదాలను వినియోగించడంతో రెవెన్యూ వ్యవస్థలో పదాలు చిత్రవిచిత్రంగా మారాయి. రెవెన్యూ వ్యవహారాలు తెలిసిన వారికి మినహా ఇతరులకు అవి అంతగా అర్థం కావు. రెవెన్యూలో అవినీతి మేట వేయడానికి ఆ పదాల అంతరార్థం తెలియకపోవడం కూడా ఒక కారణం. ఈ తరం రెవెన్యూ అధికారుల్లో చాలా మందికి కూడా ఆ పదాలతో తగిన పరిచయం లేదనడంలో సందేహమే లేదు. ఈ నేపథ్యంలో రెవెన్యూ పదాలు, వాటి అర్థాలు ‘సాక్షి’ పాఠకుల కోసం..

రీ సెటిల్‌మెంట్‌ రిజిష్టర్‌ (ఆర్‌ఎస్‌ఆర్‌) 
రెవిన్యూ అధికారులకు కీలకమైన రికార్డు ఇది. ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం భూమి సేకరణ చేయాలంటే ఈ రికార్డునే ఆధారంగా చేసుకుని ధర నిర్ణయిస్తారు. ఆర్‌ఎస్‌ఆర్‌ రిజిష్టర్‌ల్లో ప్రభుత్వ భూమి, ప్రైవేట్‌ భూమి(వ్యక్తులు), ఈనాం భూములు, దేవదాయ, వక్ఫ్‌ భూములు, వాగులు, వంకలు తదితర భూముల వివరాలు ఉంటాయి. దీనికి సంబంధించిన రికార్డులు వీఆర్‌ఓ, తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలతోపాటు జిల్లా స్థాయిలో ఏడీ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి. 

1బీ రికార్డు
ఒక రైతుకు రెవెన్యూ విలేజ్‌లో ఏఏ సర్వే నంబర్‌లో ఎంత విస్తీర్ణం భూములు ఉన్నాయో 1బీ రికార్డులో నమోదు చేస్తారు. రైతుకు సంబంధించిన పట్టాదారు పాస్‌ పుస్తకంలో ఉన్న ఖాతా నంబర్‌ ఆధారంగా 1బీ రికార్డులో వరుసగా ఆ రైతు భూముల వివరాలు అన్నింటినీ నమోదు చేస్తారు. రైతు వ్యక్తిగత రికార్డు ఇది. ఎవరెవరికి ఎంత పొలం ఉంది?, పట్టాదారు ఎవరు?, అనుభవదారుడు ఎవరు? లాంటి వివరాలు నమోదై ఉంటాయి. గతంలో దీనిని 10(1) అడంగల్‌ అని పిలిచేవారు.

రికార్డ్‌ ఆఫ్‌ రైట్‌ (ఆర్‌ఓఆర్‌) 
భూమి యాజమాన్య హక్కుపై వివాదం తలెత్తినప్పుడు రికార్డ్‌ ఆఫ్‌ రైట్‌(ఆర్వోఆర్‌)ను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇందులో ప్రభుత్వ భూములు, బంజరు భూములు, వక్ఫ్‌ బోర్డు భూముల వివరాలు నమోదై ఉంటాయి.

డైగ్లాట్‌ 
గ్రామ రెవెన్యూ రికార్డులన్నింటికీ మూల స్తంభం ఇది. ప్రతి గ్రామంలో సర్వే సెటిల్‌మెంటు భూమి వివరాలు నమోదు చేస్తారు. అన్ని రకాల భూములు, వాటి సర్వే నంబర్లు, విస్తీర్ణం, వాటి వర్గీకరణ, శిస్తు వివరాలు ఇందులో ఉంటాయి. ఈ రిజిష్టర్‌లో వివరాలు తెలుగు, ఇంగ్లిష్‌లో రాస్తారు.

అడ్‌వర్స్‌ పొసెషన్‌
భూమిపై హక్కు ఉన్న వ్యక్తి అనుమతి పొందకుండా ఆ భూమిని స్వాధీనంలో(వాస్తవంగా, శాంతియుతంగా, బహిరంగంగా) ఉంచుకుని దానిపై నియంత్రణాధికారాన్ని కలిగి ఉండటాన్ని అడ్‌వర్స్‌ పొసెషన్‌ అంటారు. ఇలా పట్టా భూమి 12 సంవత్సరాలు, ప్రైవేట్‌ భూమి 30 సంవత్సరాలు స్వాధీనంలో ఉన్నట్లయితే సివిల్‌ కోర్టు ద్వారా యాజమాన్య హక్కులు పొందవచ్చు. 

అజమాయిషీ 
గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహించే లెక్కలను తనిఖీ చేయడాన్ని అజమాయిషీ అంటారు. వీఆర్‌ఓ, మండల ఆర్‌ఐ పొందుపరిచిన లెక్కల్లో వివరాలను కొన్నింటినైనా డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్‌ తనిఖీ చేయాలి. అలా తనిఖీ చేసిన వివరాలను గ్రామ లెక్క నం.3లో నమోదు చేస్తారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రక్రియ ఇది.

ఆవాదీ/గ్రామ కంఠం
గ్రామంలో ప్రజలు నివసించే భూమిని ఆవాది అంటారు. గ్రామ ఉమ్మడి స్థలాన్ని గ్రామ కంఠంగా పిలుస్తారు.

అగ్రహారం
బ్రాహ్మణులకు శిస్తు లేకుండా లేదా రాయితీ శిస్తుతో గ్రాంటుగా వచ్చిన గ్రామం లేదా గ్రామంలోని కొంత భాగాన్ని అగ్రహారం అని పిలుస్తారు.

ఫసలీ
ఏటా జూలై 1 నుంచి మరుసటి ఏడాది జూన్‌ 30వ తేదీ వరకు మొత్తం 12 నెలల పంట కాలాన్ని బట్టి దీన్ని నిర్ణయించారు. ఇందులో అడంగల్‌లో నమోదైన వివరాలు ఉంటాయి. ఏ ఏటికాఏడు రైతులు క్రయవిక్రయాలు జరిపితే ప్రస్తుత రైతు పేరును రౌండప్‌ చేసి కొత్త రైతు పేరును చేరుస్తారు. ఎవరైనా భూమిని కొనుగోలు చేస్తే ఆ డాక్యుమెంట్‌ తీసుకుని రెవెన్యూ అధికారులను సంప్రదించి అడంగల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి.

ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్‌ (ఎఫ్‌ఎంబీ)
గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్‌ఎంబీ ఒకటి. అన్ని సర్వే నంబర్ల పటాలు ఇందులో ఉంటాయి. వాటి నిర్ధిష్ట కొలతలు కూడా ఇందులో నమోదు చేసి ఉంటాయి.

జమాబందీ
జమాబందీ అంటే ప్రభుత్వానికి రావాల్సిన భూమి పన్ను, నీటి పన్ను ఇతర బకాయిలు సక్రమంగా లెక్క కట్టడం. మండల స్థాయి అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అనేది పరిశీలించేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుంది. రైతులు తమ సాధకబాధకాలను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి కూడా జమాబందీ అవసరం. ఏడాదికి ఒకసారి కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, ఇతర డిప్యూటీ కలెక్టర్లు పరిశీలిస్తారు.

అడంగల్‌/పహాని
సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిష్టర్‌ ఇది. మన రాష్ట్రంలో అడంగల్‌ అని, తెలంగాణలో పహాని అని అని పిలుస్తారు. అడంగల్‌లో రైతుల పేర్లు నమోదై ఉంటే ఆ భూమిపై పూర్తి హక్కు వచ్చినట్లే. భూముల క్రయ విక్రయాలు చేయాలంటే అధికారులు ఈ రిజిష్టర్‌నే ప్రామాణికంగా తీసుకుంటారు. గతంలో ‘గ్రామ లెక్క నంబర్‌’గా ఈ రిజిష్టర్‌ను పిలిచేవారు. ఏటా గ్రామంలోని అన్ని భూముల వివరాలను నమోదు చేస్తారు. సర్వే నంబర్ల వారీగా మొత్తం విస్తీర్ణం ఎంత?, ఎవరి పేరుతో  ఎంత భూమి ఉంది?, హక్కు దారులు ఎవరు?, పట్టాదారు ఎవరు? తదితర పూర్తి వివరాలు అడంగల్‌లో ఉంటాయి.

మరిన్ని వార్తలు