మూడు రోజులు.. ఇంకా కోమాలోనే మాధవీలత !

11 Oct, 2018 11:43 IST|Sakshi

వారం రోజుల పాటు శరీరంలో పురుగుల మందు ప్రభావం

ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్‌లు

 ఆత్మహత్యాయత్నం చేసిన వారి బంధువుల ఆందోళన

ఒంగోలు  /చీమకుర్తి: మండల పరిధిలో మూడురోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మిడసల మాధవీలత, కుమారుడు జనార్దన్‌లు ఇంకా కోమాలోనే ఉన్నారు. ప్రస్తుతం వారు ఒంగోలు ఆర్టీసీ డిపో పక్కన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండురోజుల క్రితం రిమ్స్‌ నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈనెల 8న పేర్నమిట్ట శాంతినగర్‌కు చెందిన మాధవీలత, కొడుకు, కూతురు కూల్‌డ్రింక్‌లో పురుగుల మందును కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.

 ఆ ఘటనలో కూతురు విజయలక్ష్మి అప్పుడే మృతిచెందగా మాధవీలత, జనార్దన్‌ మృత్యువుతో పోరాడుతున్నారు. శరీరంలో పురుగుల మందు ప్రభావం కనీసం వారం రోజుల వరకు ఉంటుందని వైద్యం చేస్తున్న డాక్టర్‌ ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం కృత్రిమ శ్వాసను ఇస్తున్నామని వారం రోజులు గడిస్తేగాని వారి ఆరోగ్యం గురించి పూర్తిగా చెప్పలేమని డాక్టర్‌ తెలిపారు. ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకుంటున్నట్లు తాలూకా సీఐ జి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్‌నోట్‌ను నిపుణులచే పరిశీలించాల్సి ఉందని ఈ సందర్భంగా తెలిపారు. 

మాధవీలత ఆత్మహత్య చేసుకోబోయే ముందు కొంతమందికి ఇవ్వాల్సిన చిన్న అప్పులను కూడా పిలిచి ఇచ్చినట్లు, అంటే  ఆత్మహత్య చేసుకోవాలనే ముందే అనుకుని ఉంటుందని  స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకోబోయే ముందు సీఎంను, కలెక్టర్‌ను అడ్రెస్‌ చేస్తూ తన భర్త చనిపోవడానికి గల కారకుల పేర్లను సూసైడ్‌నోట్‌లో రాసి ఉంచటమే కాకుండా మాధవీలత చేతుల మీదకూడా వారి పేర్లు రాసినట్లు చెప్పుకుంటున్నారు.  
 

మరిన్ని వార్తలు