నా భార్యనే కొడతావా..?

4 May, 2014 09:08 IST|Sakshi

* తాగిన మైకంలో చిన్నమామను నరికిన అల్లుడు
* తీవ్రగాయాలతో అర్థరాత్రి మృతి
 
హైదరాబాద్: తాగిన మైకంలో గొడవకు దిగి భార్యపై చేయి చేసుకున్నాడన్న కోపంతో వరుసకు చిన్న మామను అల్లుడు గొడ్డలితో నరకడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈఘటన పేట్‌బషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి కలకలం రేపింది. సీఐ ప్రవీందర్‌రావు కథనం ప్రకారం..పిట్టల ప్రతాప్ కూలీ పనులు చేసుకుంటూ గుండ్లపోచంపల్లిలో గుడిసెలో నివాసముంటున్నాడు. ఈయనకు భార్య,పిల్లలున్నారు.

అతని అన్న రాజారెడ్డి బొల్లారంలో ఉంటుండగా కులసంప్రదాయ ప్రకారం పండుగ చేసుకునే విషయంలో శుక్రవారం మధ్యాహ్నం పెద్దలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో అంతా కూర్చొని మద్యం సేవించారు. ఇంతలో ప్రతాప్,రాజారెడ్డికి వరుసకు అల్లుడయ్యే రాజా కూడా అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో ప్రతాప్‌తో రాజా భార్య అనుభాయ్‌కు మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. దీంతో ప్రతాప్, అనుభాయ్‌పై చేయిచేసుకున్నాడు.

‘నా భార్యనే కొడతావా’ అంటూ రాజా గొడ్డలితో ప్రతాప్ ముఖంపై మూడుసార్లు దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. అపస్మారకస్థితిలో ఉన్న ప్ర తాప్‌ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి, అక్కడినుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ అర్ధరాత్రి ప్రతాప్ కన్నుమూశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని రాజాతోపాటు అతని భార్య అనుభాయ్, రాజారెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు