డబ్బు కోసం తల్లిని హతమార్చాడు

8 Dec, 2015 20:18 IST|Sakshi

తణుకు (పశ్చిమ గోదావరి) : ఆస్తి కోసం ఓ కసాయి కన్నతల్లిని హత్య చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో మంగళవారం ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఇరగవరం మండలం కావలిపురం గ్రామానికి చెందిన కాసగాని సావిత్రి (75)ని ఆమె కుమారుడు శ్రీనివాస్ మంగళవారం వేకువజామున వేల్పూరు బస్‌స్టాప్‌లో పీక నులిమి హతమార్చాడు. వ్యసనాలకు అలవాటుపడిన శ్రీనివాస్ తల్లికి వచ్చిన పింఛను సొమ్మును లాగేసుకుని కొంతకాలం క్రితం ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. దీంతో ఆమె వేల్పూరు గ్రామంలోని బస్ షెల్టర్‌లో తలదాచుకుంటోంది.

గ్రామానికి చెందిన రైతులు పెడుతున్న భోజనంతో రోజులు నెట్టుకొస్తోంది. అయితే, శ్రీనివాస్ ఆమెను అలా కూడా బతకనీయలేదు. ఆమెకు వచ్చే వృద్ధాప్య పింఛన్‌తోపాటు, భిక్షమెత్తుకోగా వచ్చే సొమ్మును సైతం ఆమె కుమారుడు శ్రీనివాస్ తరచూ లాక్కెళ్లిపోతున్నాడు. ఆమెకు గల కొద్దిపాటి స్థలాన్ని తన పేరిట రాయాలని కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నాడు. ఇందుకు సావిత్రి ససేమిరా అనటంతో మంగళవారం వేకువజామున పీక నులిమి హత్య చేశాడు. స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు