ఎంత కష్టం!

6 Mar, 2020 13:13 IST|Sakshi
పరీక్షకు హాజరైన పతివాడ రాంబాబు

ఇంట్లో తండ్రి మృతదేహం  

పరీక్షకు హాజరైన కుమారుడు   

విజయనగరం, గరివిడి: ఇంట్లో తండ్రి మృతదేహం ఉండగా... పుట్టెడు దుఖంతో పరీక్షకు హాజరయ్యాడు కుమారుడు. కన్నీటిని దిగమింగుకొని పరీక్షను రాశాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని దుమ్మెద గ్రామానికి చెందిన పతివాడ రాంబాబు చీపురుపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి పతివాడ సత్యం(55) కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తండ్రి మృతి చెందడంతో రాంబాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పరీక్షకు హాజరు కావాలా! వద్దా! అనే మీమాంసలో చివరకు తన దుఖాన్ని గుండెల్లో దాచుకొని పరీక్షకు హాజరయ్యాడు. తనను ఎంతో కష్టపడి చదివించిన తండ్రి ఆశయం నెరవేర్చాలని, జన్మనిచ్చిన తండ్రి ఇకరారని తెలుసుకుని ఆయన ఆశయానికి విలువనిచ్చి పరీక్ష రాసేందుకు చీపురుపల్లిలోని జీవీఆర్‌ కళాశాలకు వెళ్లాడు. ఈ ఘటన గ్రామస్తులను కన్నీరు పెట్టించాయి. సత్యం మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మరిన్ని వార్తలు