ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

11 Jun, 2020 14:53 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి బుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రాయలసీమ, కోస్తాంధ్రలో రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాగల 48 గంటల్లో బలపడనుందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఈ రోజు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు మిగిలిన చోట్ల విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాయలసీమలో చెదురు మదురుగా తేలకపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహణశాఖ ఆయా ప్రాంతాలను అప్రమత్తం చేసింది. (కొనసాగుతున్న అల్పపీడనం)

తీరంవెంబడి గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని సముద్రం అలజడిగా ఉంటుందని, కావున మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని కమిషనర్ కన్నబాబు సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రానున్న మూడు రోజులు మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు పిడుగుల పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, చెరువుల వద్ద, నీటి కుంటల దగ్గర, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

మరిన్ని వార్తలు