కేరళకు నైరుతి, ఏపీలో మోస్తరు వర్షాలు

1 Jun, 2020 16:51 IST|Sakshi

సాక్షి, విజయవాడ: నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విజయవాడ వాతావరణ కేంద్రం సూచించంది. కాగా దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్ దీవులు, మాల్దీవులు, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లోని కొన్ని ప్రాంతాలు, కోమోరిన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయి.

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం: 
రానున్న మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30 నుంచి 40 కిలో మీటర్లు)తో ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :   
ఈ రోజు, రేపు  ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30 నుంచి 40కిలోమీటర్లు)తో దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్‌ నుంచి 43 డిగ్రీ సెల్సియస్‌ వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.

రాయలసీమ:
సోమవారం ఉరుములు, మెరుపులుతో రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమలో అక్కడక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్‌ నుంచి 43 డిగ్రీ సెల్సియస్‌ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. రేపు ఉరుములు, మెరుపులుతో రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు.

>
మరిన్ని వార్తలు