అగ్రిగోల్డ్‌ బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన స్పీకర్‌

7 Nov, 2019 14:52 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని అగ్రిగోల్డ్‌  డిపాజిట్‌ దారులకు ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ తమ్మినేని సీతారాంతో పాటు మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌, సీదిరి అప్పలరాజు గురువారం చెక్కులు పంపిణి చేశారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం బాధితులను ఆదుకున్నారని అన్నారు. మిగతా డిపాజిటర్‌లకు కూడా మరో దశలో చెక్కులు పంపిణీ చేస్తామని తెలిపారు. నమ్మకమైన చట్టబద్ధత సంస్థలోనే మీ కష్టార్జితం పెట్టుబడి పెట్టండని మంత్రి బాధితులకు సూచించారు. అలాగే ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ బాధితుల కష్టాలు, కన్నీళ్లు సీఎం జగన్‌ అర్థం చేసుకున్నారని ఆయన తెలిపారు. టీడీపీ ప్రభుత్వ పెద్దలే అగ్రిగోల్డ్‌ కుట్రదారులని, సంస్థ ఆస్తులను చౌకగా లాగేసుకొవడానికే డిపాజిట్‌ దారులను నిలువునా మోసం చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇక ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ మాట్లాడతూ.. సీఎం జగన్‌ పేదలకు అండగా ఉండాలనే సంకల్పంతో ఉన్నారని, మోసపోయి కష్టాల్లో ఉన్న అగ్రిగోల్డ్‌  బాధితులను తక్షణమే నిధులు విడుదల చేశారని ఎమ్మెల్యే తెలిపారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ఆగ్రి గోల్డ్‌ బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, ప్రతి ఒక్క బాధితుడిని సీఎం జగన్‌ ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు. ఆర్థిక సంస్థలు మోసం చేస్తే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని చెల్లించిన సందర్భం లేదని, అగ్రిగోల్డ్‌  హాయ్‌ లాండ్‌ భూములను కాజేయాలని గత ప్రభుత్వం లక్షల మంది డిపాజిట్‌ దారులను మోసం చేసిందని ఆయన అన్నారు. బాధితుల కష్టార్జితం ఒక్కపైసా కూడా నష్టపోకుండా సీఎం జగన్‌ తిరిగి ఇచ్చే బాధ్యత తీసుకున్నారని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు