కరోనా పరీక్షల్లో దేశంలోనే ఏపీ ఫస్ట్‌..

23 Apr, 2020 20:35 IST|Sakshi

వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కేఎస్‌ జవహర్‌రెడ్డి

సాక్షి, అమరావతి: అభినందించకపోయిన పర్వాలేదని.. విమర్శలు మాత్రం చేయొద్దని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కేఎస్‌ జవహర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కొన్ని పత్రికలు అసత్య వార్తలను ప్రచురించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పడు సమాచారం ప్రచురించవద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షల సంఖ్య గణనీయంగా పెరిగిందని.. ప్రస్తుతం తొమ్మిది ల్యాబ్‌ల్లో రోజుకు 3,480 టెస్టులు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 45 వేల టెస్ట్‌లు చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్‌  జోన్లలో 56, ఆరెంజ్‌ జోన్లలో 47, కేసులు నమోదు కాని గ్రీన్‌ జోన్లలో 573 మండలాలు ఉన్నాయని పేర్కొన్నారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు.
(కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష)

సగటున 830 టెస్టులు..
ఏపీలో 10 లక్షల మందికి సగటున 830 టెస్టులు చేస్తున్నామని.. దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీ మాత్రమేనన్నారు. రాష్ట్రంలో నాలుగు స్టేట్‌ కోవిడ్‌ ఆసుపత్రులు ఉన్నాయని.. కర్నూలు ఆసుపత్రిని కూడా స్టేట్‌ కోవిడ్‌ ఆసుపత్రిగా ప్రకటించామని తెలిపారు. 13 జిల్లాల కోవిడ్‌ ఆసుపత్రులు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 140 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 27 మంది కరోనా బారినపడి మరణించారని తెలిపారు.
(రెడ్‌జోన్లలో మిని కోవిడ్‌-19 సెంటర్లు: ఆళ్ల నాని)

రాష్ట్రంలో 3 లక్షలకుపైగా పీపీఈ కిట్లు..
రాష్ట్రంలో పీపీఈ కిట్లు 3 లక్షలకు పైగా ఉన్నాయని.. లక్షా 40వేలు దాకా ఎన్‌-95 మాస్క్‌లు ఉన్నాయని చెప్పారు. మనిషికి 3 మాస్క్‌లు చొప్పున 16 కోట్లు మాస్క్‌లే పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టామన్నారు. త్వరలో మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలనే నిబంధన కూడా అమలు చేస్తామన్నారు. కొత్తగా వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందికి భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశామని జవహర్‌రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు