22, 23 తేదీల్లోశ్రీవారి ప్రత్యేక దర్శనం

21 Jan, 2019 04:14 IST|Sakshi

వయోవృద్ధులు, దివ్యాంగులు,చిన్నపిల్లల తల్లిదండ్రులకు అవకాశం 

తిరుమల: శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులు, ఐదేళ్ల లోపు వయసున్న పిల్లల తల్లిదండ్రులకు ఈ నెల 22, 23 తేదీల్లో టీటీడీ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసింది. ప్రతి నెలా రెండు సాధారణ దినాల్లో వీరికి ప్రత్యేక దర్శనం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 22న వయోవృద్ధులు (65 సంవత్సరాలు పైబడినవారు), దివ్యాంగులకు టీటీడీ 4 వేల టోకెన్లు జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేలు, 3గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉన్న కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రస్తుతం ప్రతిరోజూ 1,400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు కేటాయిస్తారు. కావున భక్తులు ముందుగా వచ్చి టికెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు. 5 సంవత్సరాల లోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను 23వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు.  

నేడు తిరుమలలో పౌర్ణమి గరుడసేవ.. 
తిరుమలలో సోమవారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి గరుడ వాహనంపై  ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. 

మరిన్ని వార్తలు