టికెట్‌తో పాటే మెనూ

7 Jan, 2014 03:24 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్: దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రవేశపెట్టిన ‘డిన్నర్ ఆన్ బోర్డ్’ను మరిన్ని బస్సులకు  విస్తరించనున్నారు. అలాగే  రైల్వే తరహాలో  టికెట్ బుకింగ్‌తో పాటే తమకు కావలసిన ఆహార పదార్థాలను కూడా బుక్ చేసుకొనే సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానుంది. గత నెలలో ప్రవేశపెట్టిన ఈ పథకానికి  ప్రయాణికుల నుంచి ఆదరణ లభించడంతో మరింత సమర్థంగా అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
 
 టికెట్ బుకింగ్ సమయంలోనే మెనూ కూడా బుక్ చేసుకొనేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నామని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎ.కోటేశ్వరరావు ‘సాక్షి’తో  చెప్పారు. దీంతో భోజనం కోసం మరోసారి ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నారు. రైల్వేలో  బుకింగ్ సమయంలోనే ప్రయాణికులు వెజ్/నాన్‌వెజ్ అనే కాలమ్‌లో  ఏదో ఒకటి ఎంపిక  చేసుకోవలసి ఉంటుంది. అయితే, ఆర్టీసీ ప్రయాణికులు తమకు ఇష్టమైన  బిర్యానీ, పెరుగన్నం, రోటీ, స్వీట్లు, తదితర  ఆహార పదార్థాలలో నచ్చిన వాటిని ఎంపిక చేసుకొనేలా మెనూలోని పదార్థాలన్నింటినీ విడివిడిగా రాసి ఉంచుతారు. కాగా ఈ పథకాన్ని మరిన్ని బస్సులకు విస్తరించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు