కృష్ణాలో కొత్త ఉషస్సు!

29 Dec, 2019 07:59 IST|Sakshi

నూతన సంవత్సరంలో రుద్రవరంలోని కొత్త క్యాంపస్‌లోకి  

తైవాన్‌ ఎన్‌సీయూతో ఇప్పటికే ఎంఓయూ  

త్వరలో మరో ఆరు వర్సిటీలతో ఒప్పందాలు  

ఐఎండీతో పనిచేసేందుకు కసరత్తు    

సాక్షి, మచిలీపట్నం: జిల్లాకో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంకల్పం మేరకు 2009లో కృష్ణా యూనివర్సిటీ ఏర్పాటైంది. వైఎస్సార్‌ మరణానంతర పరిణామాలతో దాదాపు పదేళ్ల పాటు ఈ వర్సిటీ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. సుమారు రూ.90 కోట్ల అంచనా వ్యయంతో బందరు మండలం రుద్రవరం గ్రామంలో నిర్మించిన కొత్త క్యాంపస్‌లోకి వర్సిటీని తరలించేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేని దుస్థితి కొనసాగింది. వర్సిటీలో అంతర్గత కుమ్ములాటలతో విద్యాప్రమాణాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఈ నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.కృష్ణారెడ్డి వర్సిటీ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఇన్‌చార్జి వైస్‌చాన్సలర్‌ ప్రొ.సుందర కృష్ణతో కలిసి రిజిస్ట్రార్‌  కృష్ణారెడ్డి వర్సిటీలో విద్యాప్రమాణాలను మెరుగుపర్చడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. 2020 జనవరిలో కొత్త క్యాంపస్‌లో అడుగుపెట్టడంతో పాటు వివిధ జాతీయ, అంతర్జాతీయ వర్సిటీలతో కలిసి పనిచేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఆయా వర్సిటీలతో అవగాహన ఒప్పందాల ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, విద్యా ప్రమాణాలను అందిపుచ్చుకోవడం ద్వారా అంతర్గత నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు బాటలు వేస్తున్నారు. 

తైవాన్‌ వర్సిటీతో ఎంఓయూ 
తైవాన్‌ నేషనల్‌ సెంట్రల్‌ యూనివర్సిటీతో ఇటీవలే కృష్ణా వర్సిటీకి అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం వల్ల కృష్ణా వర్సిటీకి అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి. ఇక్కడ పీజీ పూర్తి చేసిన విద్యార్థులు పీహెచ్‌డీ చేయడానికి, పీహెచ్‌డీ పూర్తి చేసిన వారు పోస్ట్‌ డాక్టర్‌ ఫెలోషిప్‌ చేయడానికి తైవాన్‌ యూనివర్సిటీకి వెళ్లే అవకాశం అందిపుచ్చుకోనున్నారు. కృష్ణా వర్సిటీలోని ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు దోహదపడనుంది. ఈ ఒప్పందం ఐదేళ్ల పాటు కొనసాగనుంది. మరో వైపు తైవాన్‌ దేశానికి చెందిన చంగ్‌జున్‌ క్రిస్టియన్‌ యూనివర్సిటీతో కూడా ఎంఓయూ చేసుకోనుంది. కల్చరల్‌ ఎక్సే‍్ఛంజ్‌ తో పాటు సైంటిఫిక్‌ అండ్‌ అకడమిక్‌ ఎబిలిటిస్‌ను పెంపొందించుకునేందుకు దోహదపడనుంది. మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అయిన ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎఐటీ)తో అవగాహన ఒప్పందం చేసుకుంటోంది. దీని ద్వారా ఆక్వా జియో సైన్సెస్‌ కోర్సులను ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇరు వర్సిటీలను బలోపేతం చేసుకునేందుకు ఉపకరిస్తుంది.

విక్రమ్‌ సారాబాయ్‌ స్పేస్‌ సెంటర్‌తో..  
విక్రమ్‌ సారాబాయ్‌ స్పేస్‌ సెంటర్‌తో కూడా అవగాహన ఒప్పందం చేసుకోనుంది. దీని ద్వారా ఎట్మాస్పియర్‌ నేచురల్‌–వెదర్‌ డైనమిక్స్‌ అండ్‌ ఎడ్వాన్స్‌డ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌గా వర్సిటీని అభివృద్ధి చేసుకునేందుకు దోహదపడనుంది. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్పేస్‌ సెంటర్‌ సమకూర్చనుంది. మరోవైపు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)తో జియో స్పేర్, బయోస్పేర్, అటా్మస్పియర్‌ యాక్టివిటీస్‌ అభివృద్ధిపై అవగాహన ఒప్పందం చేసుకోనుంది. ఇండియన్‌ మెట్రాలాజికల్‌ డిపార్టుమెంట్‌ (ఐఎండీ)తో కూడా ఎంఓయూ దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఒప్పందంతో కోస్తా తీరంలో డాప్లర్‌ వెదర్‌ రాడార్స్‌ నుంచి డేటా తీసుకుని ఫోర్‌కాస్టింగ్‌ ఆఫ్‌ ది టెంపరేచర్‌ వెదర్‌ పేరా మీటర్స్‌పై వర్సిటీ రీసెర్చ్‌ చేయనుంది. వచ్చే ఆర్నెల్లలో వరుసగా మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వర్సిటీలతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడం ద్వారా కృష్ణా వర్సిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్న సంకల్పంతో పనిచేస్తున్నట్టు రిజి్రస్టార్‌ ప్రొ. కృష్ణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.  

మరిన్ని వార్తలు