డంపింగ్ యార్డులు లేని పంచాయతీలకు ప్రత్యేక నిధులు

5 Aug, 2015 02:11 IST|Sakshi

 జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారి వీరయ్య
 
 గుళ్ళపల్లి (చెరుకుపల్లి) : గ్రామాల్లో చెత్త నిల్వలు లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సింది గ్రామ కార్యదర్శులేనని జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారి జి.వీరయ్య చెప్పారు. గుళ్ళపల్లిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పారిశుద్ధ్య వారోత్సవాలను పంచాయతీలలో విధిగా నిర్వహించాలన్నారు. 10వ తేదీ వరకు రోజూ గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగు నీరు, పరిసరాల పరిశుభ్రతపై పర్యవేక్షించాలన్నారు. డంపింగ్ యార్డులు లేని పంచాయతీలు ఆ విషయాన్ని వెంటనే ఉన్నతాధికారులకు తెలపాలని సూచించారు. మైనర్ పంచాయతీలకు కూడా డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఎన్‌ఆర్‌జీఎస్ నిధులను వెచ్చిస్తోందన్నారు.

రేపల్లె నియోజకవర్గంలోని పేటేరు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం అద్వానంగా ఉండటంతో అక్కడ సిబ్బంది పని తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశామని చెప్పారు. గుళ్ళపల్లిలో అండర్ డ్రైనేజీకి ప్రత్యేక నిధులను కేటాయిస్తామన్నారు. వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని అన్ని పంచాయతీలలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తామని చెప్పారు. పారిశుద్ధ్య పనులపై నిర్లక్ష్యం వహించే గ్రామ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్పంచ్ తలతోటి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు