అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్ అనూరాధ
అయినవిల్లి విఘ్నేశ్వరుని ఆలయంలో పూజలు
తూర్పుగోదావరి, అయినవిల్లి (పి.గన్నవరం): వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని, ఆయన ప్రజాసంకల్ప యాత్ర 3,500 కిలో మీటర్లు పూర్తైన సందర్భంగా అయినవిల్లి విఘ్నేశ్వరుని ఆలయంలో పార్టీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ చింతా అనురాధ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా పనిచేస్తానన్నారు. జగనన్నను సీఎంగా చేయడమే లక్ష్యం అన్నారు. పార్టీ నాయకులతో కలిసి అయినవిల్లి నుంచి ముక్తేశ్వరం వరకూ పాదయాత్ర చేశారు. అక్కడి నుంచి స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రచార రథంపై పార్టీ పథకాలను ప్రచారం చేశారు. దారి మధ్యలో అంబేడ్కర్, రాజశేఖరరెడ్డి, వంగవీటి మోహనరంగా విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తొలుత ఆమెకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.
అనంతరం మోటార్ సైకిల్ ర్యాలీగా పార్టీ నాయకులతో కలిసి అల్లవరం మండలంలోని తన స్వగ్రామమైన మొగళ్లమూరు వెళ్లారు. పార్టీ పీఏసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు చంద్రన్న పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారన్నారు. జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. అమలాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ప్రజలు అవినీతి రహిత పాలనను కోరుకుంటున్నారన్నారు. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ ఎన్నికల్లో బూటకపు హామీలిచ్చి ప్రజలను మోసగించారని మండి పడ్డారు. పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ చంద్రబాబు తన స్వప్రయోజనం కోసం ఎంతటి తప్పైనా సునాయాసంగా చేస్తారన్నారు. ఎమ్మెల్యే, కొత్తపేట నియోజక వర్గ కోఆర్డినేటర్ చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకులు జన్మభూమి కమిటీల పేరుత్లో అందినంత దోచుకున్నారన్నారు. రాజోలు కోఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు మాట్లాడుతూ జగన్తోనే రాష్ట్ర అభ్యుదయం అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహనరావు, కర్రి పాపారాయుడు, సుదర్శన బాబు, చెల్లుబోయిన శ్రీను పాల్గొన్నారు.