'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు'

5 Aug, 2015 18:20 IST|Sakshi

నరసరావుపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఆంధ్రులకు హక్కులా భావించాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. దీనికోసం పార్టీలు, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం గుంటూరు జిల్లా నరసరావుపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఎస్‌ఎస్‌ఎన్ కళాశాల వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీలో పలు కళాశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్గమధ్యలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం ర్యాలీనుద్దేశించి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి ఐటీ, ఇతర పరిశ్రమలు వస్తాయని తద్వారా చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రత్యేక హోదా కల్పిస్తామని బీజేపీ, టీడీపీ నాయకులు చేసిన వాగ్దానాలను వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈనెల 10న ఢిల్లీలో చేస్తున్న దీక్షను విజయవంతం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు