ప్రతి ఊరూ... మహాభారత కథకు సాక్ష్యాలే...

6 Oct, 2019 08:43 IST|Sakshi

సాక్షి, శృంగవరపుకోట : తింటే గారెలే తినాలి... వింటే భారతమే వినాలి. అంటారు కదా. అలాంటి మహాభారతంలోని సంఘటనలకు సాక్ష్యాలే శృంగవరపుకోట పరిసర ప్రాంతాలు. ఒక్కో ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుంటే అంతా ఆసక్తికరంగా ఉంటుంది. విరాటరాజ్య రక్షకుడు అయిన కీచకుడు తన శృంగార కార్యక్రమాలకు మట్టికోటను వినియోగించేవాడు. అదే ఈ ప్రాంతంలో నేడు వృంగవరపుకోటగా వాసి కెక్కింది. దండకారణ్య ప్రాంతంలో విరాటరాజు కొలువులో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు భీముని చేతిలో నిహతుడైన కీచకుని సద్గతి కల్పించాలని సుధేష్ణదేవి కోరికమేరకు పుణ్యగతులు పొందిన ప్రాంతం నేడు పుణ్యగిరిగా ప్రసిద్ధిగాంచింది.

విరటుని కొలువులో ఉన్న పాండవుల అజ్ఞాతవాసం భగ్నం చేయాలని లాక్ష్య గృహదహనం జరిగిన ప్రాంతం తర్వాత లక్కవరపుకోటగా మారింది. ద్వాపర యుగంలో పాండవులు వనవాసం చేసిన సమయంలో నాటి జమ్మివనం ఉన్న ప్రాంతంలో తమ అస్త్ర,శస్త్రాలను జమ్మి చెట్టుపై భద్రం చేశారు. కాల క్రమేణా జామి గ్రామంగా మారింది. ఉత్తర గోగ్రహణం వేళ కౌరవులు తోలుకుపోతున్న ఆలమందను  అర్జునుడు అడ్డుకున్న స్థలం ఇప్పుడు అలమండ అయ్యింది. అజ్ఞాతవాసంలో వలలుడు పేరుతో వంటవాడిగా భీముడు ఉన్న ప్రాంతం భీమాళిగా మారిందని ప్రతీతి.

మరిన్ని వార్తలు