ఇక్కడంతా వెరీ 'స్మార్ట్‌' ! 

9 Nov, 2019 08:21 IST|Sakshi

సాక్షి, ఆత్మకూరు : కాలంతో పాటు మనుషులు కూడా మారుతున్నారు. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా   టెక్నాలజితో  సమానంగా పరుగులు తీస్తున్నారు. అరచేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు ప్రపంచాన్నే చుట్టి వస్తున్నారు. బ్యాంక్‌ ఖాతాల్లో నగదు ఉంటే  చాలు ఏ పనైనా సులువుగా చేసేస్తున్నారు.      

4జీదే హవా 
ప్రస్తుత ప్రతి ఒక్కరి చేతిలో 4 జీ సెల్‌ ఫోన్‌ దర్శనమిస్తోంది. స్టూడెంట్‌ మొదలు ఉద్యోగి దాకా అంతా స్మార్ట్‌బాటలో పయనిస్తున్నారు. తమ అవసరాలను తీర్చుకునేందుకు కూడా ఎక్కువగా ఫోన్‌నే ఉపయోగిస్తున్నారు. దూరానికి వెళ్లి చేసుకోవాల్సిన పనులు సైతం ఇంట్లో కూర్చొని ఒక్క క్లిక్‌తో కానిచ్చేస్తున్నారు.  

పరుగుకు స్వస్తి 
గతంలో కరెంట్‌ బిల్లులు , గ్యాస్‌ బిల్లులు, రేషన్‌ బిల్లులు ఇలా ఏ బిల్లు చెల్లించాలన్నా ఆయా కార్యాలయాలకు పరుగులు తీయాల్సి వచ్చేది. ఒక్కోసారి కొన్ని పనులకు అర్ధరోజు కూడా పట్టేది. అయితే ఇప్పుడు డిష్‌ బిల్లు మొదలు టిఫిన్‌ బిల్లు దాకా నీటి పన్ను మొదలు సినిమా టికెట్‌ దాకా అన్నింటికీ ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం తదితర యాప్‌లను వినియోగిస్తూ చక్కబెట్టుకుంటున్నారు.  

తప్పిన చిల్లర సమస్య 
గతంలో ఏ దుకాణానికి వెళ్లినా రూ.5 విలువ చేసే వస్తు కొనాలంటే చిల్లర సమస్య వచ్చేది. దీంతో దుకాణదారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అయితే ఇప్పుడు టీ తాగినా సరే ఎక్కువ మంది యాప్‌ల ద్వారానే నగదును బదిలీ చేసేస్తూ ఏ గొడవా లేకుండా బయటపడుతున్నారు. దీనికి తగ్గట్టుగా చిన్న బడ్డీ కొట్టు మొదలు పెద్ద పెద్ద స్టార్‌ హోటళ్ల దాకా వాటి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీ షాపులు, టిఫిన్‌ సెంటర్లు, సరుకుల అంగళ్లు, ఎరువుల దుకాణాలు ఒక్కటేంటి అంతా స్మార్‌బాట పట్టారు.   

మరిన్ని వార్తలు