కదిలిస్తే కన్నీళ్లే.. ఈ రొంపి ఇంకెన్నాళ్లు!

15 Nov, 2019 14:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: అభం శుభం తెలియని బాలికలను బలవంతంగా దేవదాసీ వృత్తిలోకి దింపుతున్నారు. వారు దేవుడికి సేవ చేయాలన్న కారణం చూపి.. లైంగిక వాంఛ తీర్చుకుంటున్న దారుణాలు నేటికీ ఎన్నో జరుగుతున్నాయి. జోగిణి, బసివిణి, దేవదాసి, మాతంగి.. ఇలా పేరు ఏదైనా జరిగేది మాత్రం లైంగిక దోపిడీయే. మొదట.. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఓ బాలికను ఎంచుకుంటారు. ఆ తర్వాత వారి తల్లిదండ్రులకు పొలం ఇస్తామంటారు. లేదంటే ఇంటి స్థలమో, లేదంటే అనారోగ్యాన్ని కారణంగా చూపుతారు. అమ్మవారు పట్టిందని అంటారు. దేవుడికి జీవితాన్ని అంకితం ఇవ్వాలని ఇది సంప్రదాయమని ఎప్పటినుంచో వుందని అంటారు. జోగిని, బసివిని, మాతంగి, దేవదాసి, పార్వతి, పద్మావతి ఇలా ఒక్కొ ప్రాంతంలో ఒక్కొ పేరుతో ఈ దురాచారం కొనసాగుతోంది.

ఇలా పలు కారణాలతో ఈ రొంపిలోకి అమాయక ఆడ పిల్లలను దింపుతున్నారు. దేవుడు పేరు చెప్పి దెయ్యాల్లాంటి మనుషులు లొంగదీసుకుంటున్నారు. ఆడపిల్లల్ని ఆటవస్తువులుగా మార్చి లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ దురాచారం కొనసాగుతోంది. ఈ ఆధునిక యుగంలో కూడా ఈ దురాచారం కొనసాగుతోందా అని ఆశ్చర్యపోతున్నారా?. నిత్యం కరవు కాటకాలతో తల్లడిల్లే అనంతపురం జిల్లాలోనే కాదు కర్నూలు, మహబూబ్నగర్ వంటి జిల్లాల్లోనూ ఈ విష సంస్కతి ఇంకా కొనసాగుతోందనడానికి ఈ అమాయక మహిళల గోడే నిదర్శనం.
 

మరిన్ని వార్తలు