పల్లె ముంగిటే పాలన సంక్షేమ పథకాల లాలన..

31 May, 2020 05:08 IST|Sakshi
తూర్పు గోదావరి జిల్లాలోని తాడిపల్లి గ్రామం

(ఎల్‌.శ్రీనివాసరావు, రాజమహేంద్రవరం) 
జిల్లా: తూర్పుగోదావరి 
మండలం: రామచంద్రపురం
గ్రామం: తాడిపల్లి 

► వెయ్యికి కొంచెం అటు ఇటుగా ఉండే జనాభా. తొంభై శాతం మంది వ్యవసాయం, కూలి పనులు చేసుకునే వారే. ఊరిలో అడుగు పెట్టగానే శివాలయం వీధి సెంటర్‌లో రచ్చబండ.  పది మంది వరకు రైతులు కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఒకరిద్దరు తప్ప అంతా ఆరు పదుల వయస్సు దాటిన వారే. సాక్షి వారిని పలకరించగా– గ్రామ సచివాలయం, వలంటీర్లు వచ్చాక మా బోటి వాళ్ల కష్టాలు తీరాయి బాబూ అంటూ 80 ఏళ్లు పైబడ్డ ఓ పెద్దాయన ఆనం దంతో చెప్పాడు. 40, 50 ఏళ్లు ఉన్న మరో ఇద్దరు కల్పించుకుని ఇప్పుడు చాలా మార్పు కనిపిస్తోందని, దేనికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేదని, నాయకులను బతిమలాడాల్సి న అవసరం లేకుండా పోయిందంటూ  చె ప్పారు. పింఛన్, రైతు భరోసా, అమ్మ ఒడి వంటి పథకాలు ఎటువంటి కష్టం లేకుండా అర్హులందరికీ అందుతున్నాయన్నారు. .  

► ప్రభుత్వ కార్యాలయాల్లో పని ఉంటే ఏడెనిమిది కిలోమీటర్ల దూరం ఉన్న మండల కేంద్రానికి వెళ్లాల్సిందే. 4 కిలోమీటర్ల దూ రం వెల్ల గ్రామానికి నడచి వచ్చి అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరానికి ఆటో ఎక్కాల్సి వచ్చేది. సచివాలయం, వలం టీర్లు వచ్చాక సర్కారు సేవలు గుమ్మంలోకి రావడం చూస్తుంటే ఏడాదిలో ఎంత మార్పు అంటున్నారు స్థానికులు. 

చిన్న గ్రామంలో ఆరుగురికి ఉద్యోగాలు 
ఈ గ్రామంలో ఏకంగా ఆరుగురికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. సాదా అనంతలక్ష్మి వార్డు శానిటరీ కార్యదర్శి, పిల్లి మౌనిక వార్డు ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, బోయిన శ్రీలక్ష్మి మహిళా పోలీస్, డెంకాని దుర్గాప్రసాద్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్, కురుపూడి శివరామకృష్ణ వెటర్నరీ అసిస్టెంట్, మాచవరపు నవ్య సుధ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగాలకు ఎంపికై విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారున్నారు. 

అభివృద్ధి అడుగులు
ఓ మూలకు విసిరేసినట్టు ఉండే బడి. పిల్లలకు మరుగుదొడ్లు లేవు. ప్రహరీ కట్టించి మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలనేది  చాలా కాలంగా ఉన్న సమస్య. వలంటీర్లు ఇంటింటా సర్వేకు వచ్చినప్పుడు బడికి ప్రహరీ కోసం అడిగిన వారం రోజులు తిరగకుండానే ‘నాడు–నేడు’లో రూ.14 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో మంచి నీరు, మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణాలు పూర్తి కావొచ్చాయని ప్రజలు చెప్పారు. గ్రామంలో మూడు పక్కలా మూడు చెరువులు ఉన్నాయి. ఏ చెరువు చూసినా దుర్గంధంతో, పూడికతో ఉండేవి. ఈ విషయమై సచివాలయంలో చెప్పగా వారం తిరగకుండా మూడుచెరువుల మరమ్మతులు చేపట్టారు. ఒక చెరువు పని పూర్తి అయిపోయింది. మిగిలిన రెండు చెరువుల మరమ్మతులు చేస్తున్నారని, నెలలో అవి పూర్తవుతాయని సంతోషంగా చెప్పారు. గ్రామంలో నాలుగంటే నాలుగు రోడ్లు ఉన్నాయి. వర్షంలో మోకాలి లోతు బురదలో వెళ్లే రోజులు పోయి రూ.35 లక్షలతో ఊరంతా సీసీ రోడ్లు వచ్చాయి. 

ప్రభుత్వమే మా ఇంటికి వచ్చినట్టుగా ఉంది.. 
నాకు 72 ఏళ్లు వచ్చాయి. వలంటీర్లు ఇంటికి వచ్చి సాధక బాధకాలు అడిగి వెళ్తుంటే ప్రభుత్వమే మా ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తోంది. పింఛన్‌ కోసం అర్జీతో మనవడిని బతిమలాడి మోటార్‌ బైక్‌ ఎక్కి రామచంద్రాపురం ఆర్డీవో ఆఫీసుకో, కాకినాడ కలెక్టర్‌ ఆఫీసుకో వెళ్లే వాళ్లం. ఇప్పుడు వలంటీర్లే మా ఇంటికి వచ్చి అర్జీ ఇచ్చి, దాన్ని పూర్తి చేసి వేలిముద్రలు వేయించుకుని పింఛన్‌ ఇప్పించారు. ప్రభుత్వం నాకు రూ.2,250 ఫించన్‌ ఇస్తోంది.  
 – మాధవరపు సత్యనారాయణ,, తాడిపల్లి 

పంట బాగా పండింది.. 
నాకు రెండు కుంచాల సొంత చేను ఉంది. దీనికి రైతు భరోసా డబ్బులు నా ఖాతాలో పడ్డాయి. మరో 4 ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. ఈ ఏడాది పంట బాగానే పండింది.      
 – వాసంశెట్టి నాగ ఆంజనేయులు, కౌలు రైతు 

చాలా మార్పు వచ్చింది 
నేను 7 ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. పొలం పనులు లేని సమయంలో కూలి పనులకు వెళుతుంటాను. గతంలో  ఏదైనా అవసరం వస్తే కూలి పనులు మానుకుని ఆఫీసులు చుట్టూ తిరిగే వాళ్లం కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. అంతా బాగుంది.  
     – కొప్పిశెట్టి శివశంకర్, కౌలు రైతు  

చదువు మానిపిద్దాం అనుకున్నా.. 
మేము నాయీబ్రాహ్మణులం. ఆయన ఇంటింటికి వెళ్లి వృత్తి చేస్తుంటారు. పల్లెటూరు కావటంతో అంతగా పని ఉండదు. ఏడో తరగతి చదువుతున్న మా అబ్బాయి వెంకట ఆదిత్యకు అమ్మఒడి పథకం కింద రూ.15 వేలు ఇచ్చారు. అమ్మాయి రామచంద్రపురం డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. స్తోమత లేక చదువు మాన్పించేద్దామని అనుకున్నాను. సరిగ్గా అదే సమయంలో  విద్యా దీవెన ద్వారా రూ.10 వేలు వచ్చాయి. అవి వేణ్నీళ్లకు చన్నీళ్ల సాయంగా నిలిచాయి.  
 – సుందరపల్లి నందీశ్వరి, గృహిణి 

మరిన్ని వార్తలు