అత్యాచారంపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు

25 Sep, 2014 01:10 IST|Sakshi

 బుట్టాయగూడెం : జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని ఒక మండలంలో ఓ హాస్టల్‌లో చదువుతున్న అమాయక విద్యార్థినులపై అత్యాచార ఘటనపై దర్యాప్తు నిమిత్తం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఏవీ సుబ్బరాజు చెప్పారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. వీరికి  సహకరించిన వంట మనిషిని అరెస్ట్ చేశామన్నారు.  డివిజన్ పరిధిలోని ఒక మండలంలో ఉన్న హాస్టల్‌లోని విద్యార్థినులతో ఆసాంఘిక కార్యకలాపాలు చేయిస్తున్న కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వంట మనిషి గుడికందుల శ్యామల, అత్యాచారానికి పాల్పడిన గండ్రోతు రామకృష్ణ, బందెల మధు, కనిపాటి సునీల్‌కుమార్ (సుందరం)లపై నిర్భయ్,
 
 ఫోక్స్ యాక్ట్, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ, పీసా చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. అత్యాచారానికి సంబంధించి సాక్షాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిన హాస్టల్‌వార్డెన్‌పై కూడా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. వీరిని జంగారెడ్డిగూడెం ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామన్నారు. అలాగే అత్యాచారం చేసిన ముగ్గురిపై రౌడీషీట్లు తెరుస్తున్నట్టు వెల్లడించారు. కలెక్టర్ కాటమనేని భాస్కర్, ఎస్పీ రఘురామ్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. డీటీసీ కేజీవీ సరిత, జంగారెడ్డిగూడెం సీఐ అంబికాప్రసాద్, ఎస్సై సైదానాయక్, ఎస్సై కాంతి ప్రియ దర్యాప్తు టీమ్‌లో ఉన్నట్లు డీఎస్పీ వివరించారు.
 

మరిన్ని వార్తలు