సత్ఫలితాలిస్తున్న కోర్టు మానిటరింగ్

6 Feb, 2014 05:11 IST|Sakshi

నిజామాబాద్ లీగల్, న్యూస్‌లైన్ : జిల్లాలో కోర్టు మానిటరింగ్ సిస్టం ప్రారంభమైనప్పటి నుంచి కేసులు త్వరితగతిన పరిష్కారమవుతున్నాయి. కోర్టుల్లో పేరుకుపోయిన కేసులను పరిష్కరించేందుకు ప్రభుత్వం విజయవాడలో అమలు చేస్తున్న కోర్టు మానిటరింగ్ సిస్టంను నిజామాబాద్ జిల్లాలో మార్చి 1, 2013న ప్రారంభించింది. ఈ సిస్టం వల్ల కక్షిదారులకు, న్యాయవాదులకు సమయం వృథా కావడం లేదు.

అప్పటి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవికుమార్, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరిపూర్ణ మహేందర్‌రెడ్డి ఎస్పీ విక్రమ్‌జిత్‌దుగ్గల్ కోర్టు మానిటరింగ్ సిస్టం అమలు కోసం సమీక్ష, సమావేశాలు నిర్వహించి కోర్టు మానిటరింగ్ సిస్టం ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈక్రమంలో జిల్లాలో 25 కోర్టులు ఉండగా 23 కోర్టుల్లో కోర్టు మానిటరింగ్ సిస్టాన్ని ప్రారంభించారు. దీనికింద జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సెషన్ కోర్టు జడ్జి కోర్టుల్లో ఒక ఏఎస్సై, ఒక కానిస్టేబుల్‌ను, ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు.

 వీరు కోర్టులో ఉన్న కేసులకు సంబంధించిన సాక్షులను, కోర్టువారు జారీ చేసిన సమన్లతో సాక్షులను సకాలంలో హాజరుపరుస్తారు. గడిచిన 9 నెలలల్లో జిల్లాలో ఉన్న కోర్టుల్లో సుమారు 350 కేసులు పరిష్కారమైనట్లు అధికారులు తెలిపారు. ఈ పద్ధతిపై జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి 11 కేసులను పరిష్కరించారని జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.పరిపూర్ణ మహేందర్‌రెడ్డి తెలిపారు. 9 హత్య కేసుల్లో 13 మందికి జీవిత ఖైదీ విధించారన్నారు.

>
మరిన్ని వార్తలు