ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి

28 Oct, 2017 07:13 IST|Sakshi

కొత్తపేట : తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్‌ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొత్తపేట మండలం మోడెకుర్రు వద్ద శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. 

అల్లవరం గ్రామానికి చెందిన మహిళలు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆటోలో వెళ్తున్న సమయంలో మోడెకుర్రు వద్దకు రాగానే ఎదురుగా అమలాపురం వెళ్తున్న ఇసుక టిప్పర్‌ ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఐదుగురు మహిళలు అక్కడికికక్కడే మృతి చెందగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు క్షతగాత్రులను అమలాపురం ఆస్పత్రికి తరలిస్తుండగా.. మరో మహిళ మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా అల్లవరం గ్రామానికి చెందిన నాగమణి, పార్వతి, భవాని, అనంతలక్ష్మి, పి. అనంతలక్ష్మి, దుర్గలుగా గుర్తించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. టిప్పర్‌ అతివేగంగా వస్తుండటంతో.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు