ఆంధ్రా ప్యారిస్‌కు ఆధ్యాత్మిక శోభ

31 Jan, 2015 07:52 IST|Sakshi
ఆంధ్రా ప్యారిస్‌కు ఆధ్యాత్మిక శోభ
  • తెనాలి శివారులో నేడు హనుమాన్ చాలీసా పారాయణం
  • సర్వం సిద్ధం చేసిన నిర్వాహకులు
  • తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ల రాక
  • హాజరు కానున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు
  • గణపతి సచ్చిదానంద స్వామిజీ పర్యవేక్షణలో పారాయణం
  • తెనాలిటౌన్: స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని జానకీ రామ హనుమత్ ప్రాంగణంలో శనివారం జర గనున్న శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మైసూర్ దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానందస్వామి స్వీయ పర్యవేక్షణలో 1.11 లక్షల మంది భక్తులు ఏకకాలంలో పారాయణం చేయనున్నారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పారాయణం జరుగుతుంది. స్వామిజీ భక్తులతో పారాయణం చేయించి, ప్రసంగిస్తారు.

    శ్రీ హనుమాన్ సేవా సమితి సభ్యులు, దత్త పీఠం ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు జాగిలాలతో, బాంబు స్క్వాడ్ సిబ్బంది ప్రాంగణం మొత్తం తనిఖీలు జరిపారు. శుక్రవారం నుంచే భక్తులతో ప్రాంగణం కళకళాడుతుంది. దూర ప్రాంతం నుంచి భక్తులు ఇప్పటికే ప్రాంగణానికి చేరుకుంటున్నారు. హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్నే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. భక్తులు తాగునీరు, భోజన వసతి, మరుగుదొడ్ల సదుపాయం కల్పిస్తున్నారు. పట్టణానికి నలు వైపులు రూట్‌మ్యాప్‌లు ఏర్పాటు చేశారు. భక్తులకోసం ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పిస్తున్నారు. భక్తులు ఉదయం 8గంటలలోపు  ప్రాంగణంలోకి చేరుకోవాలని సేవా సమితి ఆర్గనైజర్ వరదరాజులు తెలిపారు.
     
    గవర్నర్ల రాక..

    హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొనేందుకు తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో పాటు, రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, దేవదాయశాఖమంత్రి మాణిక్యాలరావులతో పాటు పలువురు మంత్రులు, శాసనసభ్యులు వస్తున్నట్లు చెప్పారు. శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, శాసన మండలి చీఫ్‌విప్ నన్నపనేని రాజకుమారి, శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, రాజ్యసభ మాజీ సభ్యులు యడ్లపాటి వెంకట్రావులతోపాటు పట్టణంలోని పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
     
     భక్తితో దైవనామస్మరణ చేయాలి..

     తెనాలిటౌన్: స్థానిక గంగానమ్మపేటలోని శశివేదికలో శుక్రవారం మైసూరు దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో పట్టణం ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సీహెచ్ శ్రీధర్, రాజ్యసభ మాజీ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావు, బదిలీపై వెళ్లిన డీఎస్పీ టి.పి.విఠలేశ్వర్, హనుమాన్ సేవా సమితి ఆర్గనైజర్ వరదరాజులు, మహాత్మ ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, దత్తపీఠం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి స్వామిజీ మాట్లాడుతూ భక్తితో స్మరణ చేయాలని సూచించారు.
     

మరిన్ని వార్తలు