ప్రోటోకాల్‌ రగడ

22 Dec, 2018 13:51 IST|Sakshi
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

వివక్ష చూపుతున్నారని ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌ ఆగ్రహం

వీసీ దామోదర్‌నాయుడుతో వాగ్వివాదం

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జోక్యంతో సద్దుమణిగిన వివాదం

గుంటూరు రూరల్‌: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలోని వర్శిటీ కార్యక్రమాల్లో తనకు కనీసం ఆహ్వానం లేకుండా, సమాచారం కూడా ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాల్లో తన పేరును సైతం ఏర్పాటు చేయడంలేదని తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. లాంఫాం వ్యవసాయ పరిశోధనా స్థానంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన విత్తన శుద్ధి గిడ్డంగి ప్రారంభోత్సవం, శాటిలైట్‌ పరిశోధనా స్థానం శంకుస్థాపన కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం తనకు ఎందుకు ఇవ్వలేదని ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ వర్శిటీ వీసీ డాక్టర్‌ దామోదర్‌నాయుడుతో వాగ్వి వాదానికి దిగారు. తనకేమీ సంబంధంలేదని, జిల్లా కలెక్టర్‌ ప్రోటోకాల్‌ ప్రకారమే అందరికీ సమాచారం ఇచ్చామని, అదేవిధంగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేశామని వీసీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.

మంత్రి సోమిరెడ్డి కల్పించుకుని ఇరువురికి సర్ధి చెప్పాడు. దీంతో వివాదం సద్దు మణిగింది.
గుంటూరు రూరల్‌: రైతులకు అధునాతన పద్ధతుల ద్వారా వ్యవసాయంలో నైపుణ్యతలు పెంపొందించేందుకు ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు, శాస్త్రవేత్తలు ఎల్లప్పుడూ కృషి చేస్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. లాంఫాం వ్యవసాయ పరిశోధనా స్థానంలోని వర్శిటీ ప్రాంగణంలో నూతన పరిశోధనా భవనం సముదాయానికి శంకుస్థాపన,  విత్తన శుద్ధి గిడ్డంగి ప్రారంభోత్సవం శుక్రవారం జరిగాయి. మంత్రి మాట్లాడుతూ రూ. 50 లక్షలతో అధునాతన పద్ధతిలో విత్తన శుద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా గంటకు రెండు టన్నుల వరకు విత్తనాలు, అపరాలు శుద్ధి చేయవచ్చని చెప్పారు. నూతనంగా నిర్మిస్తున్న శాటిలైట్‌ అగ్రికల్చర్‌ పరిశోధనా స్థానాన్ని రూ 1.75 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. డిజిటలైజేషన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సెంటర్‌ను రూ. 64 లక్షలతో ఏర్పాటు చేస్తున్నామని, అగ్రికల్చర్‌ మార్కెట్‌ ఇంటలిజెన్స్‌ సెంటర్‌ను రూ. కోటి ఐదు లక్షలతో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వర్శిటీ వీసీ డాక్టర్‌ వి. దామోదర్‌నాయుడు, వర్శిటీ శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు