త్వరలో ‘శ్రీ పూర్ణిమ’ గ్రంథావిష్కరణ

23 Jul, 2019 09:59 IST|Sakshi

మ‌న జీవన విధానానికి, స‌మాజ సంస్కృతుల‌కు ఉప‌యోగ‌ప‌డే ఎంతో మ‌హోత్కృష్ణ గ్రంథ‌రాశిని అందిస్తున్న విఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ జ్ఞాన మ‌హాయ‌జ్ఞకేంద్రం ప్రచురించిన శ్రీ పూర్ణిమ విశేష గ్రంథం మ‌న‌సు ప్రార్థన వైను అంటూ ప‌ర‌మ ప‌విత్రమైన సంచ‌ల‌నాన్ని సృష్టిస్తోంది. సుమారు 800 పేజీల‌తో 150 వైదిక విశేషాంశాల‌తో రెండు వంద‌ల పైచిలుకు అరుదైన వ‌ర్ణ చిత్రాల‌తో మ‌న‌స్సుని ఇట్టే ఆక‌ట్టుకునే అంద‌మైన వ్యాఖ్యానాల‌తో అందిన ఈ శ్రీపూర్ణిమ గ్రంథం అందరినీ ఆకర్షిస్తుంది.

ప్రముఖ సినీ న‌టి, న‌గ‌రి ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర నాయ‌కురాలు ఆర్‌.కె.రోజా భ‌క్తి రసాత్మక స‌మ‌ర్పణ‌లో ప్రముఖ ర‌చ‌యిత శ్రీశైల దేవ‌స్థానం పూర్వ ప్రత్యేక స‌ల‌హాదారులు పురాణ పండ శ్రీనివాస్ విల‌క్షణంగా అద్భుత‌మైన రీతిలో రూపుదిద్దుకున్న ఈ శ్రీపూర్ణిమ గ్రంథాన్ని తిరుమ‌ల పూర్వ ప్రధానార్చకులు ర‌మ‌ణ‌దీక్షితులు, ప్రస్తుత ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితుల‌తో పాటు అర్చక బృందాలు, వేద‌పండిత బృందాలు, మంగ‌ళాశాస‌నాల‌తో అభినందించ‌డం విశేషం.

పురాణ పండ శ్రీనివాస్ గ్రంథాల్లో స‌ముజ్వల‌మైన సంస్కృతి, ప్రశంసాయోగ్యమైన స‌భ్యత‌, జీవన విధానాల ల‌క్ష్యశుద్ధి, వైదిక మంత్ర శ‌బ్దరాశుల ప్రహ‌హాలు పుష్కలంగా ఉండ‌ట‌మే కాకుండా శ్రీనివాస్ వ్యాఖ్యాన వైఖ‌రిలోని సొగ‌సులు ఎంతో ఆక‌ర్షణీయంగా ఉంటాయ‌ని ర‌మ‌ణ దీక్షితులు ప్రశంసించారు. ప్రస్తుత ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ భార‌తీయుల భావ‌న‌లో, జీవ‌నంలో వైదిక త‌త్వమే ప్రతిబింబిస్తుంద‌ని, ఆ వైదిక తత్వం విరాట్ స్వరూపంగా శ్రీపూర్ణిమ గ్రంథమై సాక్షాత్కరించి రోజా వంటి రాజకీయ‌నాయ‌కురాలు ద్వారా ఎంతో భ‌క్తితో స‌మ‌ర్పించ‌బ‌డటం చూసి ఆమె విన‌య సంప‌త్తిని ఆవిష్కరిస్తోంద‌ని పేర్కొంటూ, ఓ ఎంతో భ‌క్త్యావేశంతో పురాణ పండ శ్రీనివాస్ ఈ అపరూప గ్రంథాన్ని ప్రయోగజ్ఞత‌గా అందించి శ్రీవారి కృపకు నోచుకోవ‌డం అర్చకుల హ‌ర్షానికి కార‌ణ‌భూతమైంద‌న్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్ ప‌విత్ర హ‌స్తాల మీదుగా ఈ వారం ఆవిష్కరించ‌నున్న ఈ గ్రంథాన్ని ఆర్‌.కె.సెల్వమ‌ణి, శ్రీమ‌తి రోజా దంప‌తులు భ‌క్తి శ్రద్ధల‌తో ముందుగానే శ్రీవారి అనుగ్రహం కోసం తిరుమ‌ల అర్చకుల‌కు త‌మ స‌హ‌చ‌ర బృందం ద్వారా అందించ‌డం ప్రత్యేక విశేషంగానే చెప్పుకోవాలి. ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమం క‌సం అలుపెరుగ‌క శ్రమిస్తున్న ప్రియ‌త‌మ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌రిపాల‌న అన్ని వ‌ర్గాల వారికి క్షేమ‌దాయ‌కం కావాల‌ని ఈ గ్రంథం చివ‌ర‌లో శ్రీమ‌తి రోజా ప్రక‌టించ‌డం శాంతిదాయ‌క‌గా ఉంది.

మరిన్ని వార్తలు