మంత్రాలయం రూరల్: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో తుంగభద్ర నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కర్ణాటకలోని టీబీ డ్యాం నిండటంతో అధికారులు దిగువకు భారీ ఎత్తును నీటిని వదులుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఈ నీరు మంత్రాలయానికి చేరాయి. పరవళ్లు తొక్కుతున్న నదిని చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున వచ్చారు. దీంతో నది తీర ప్రాంతంలో సందడి కనిపించింది. వరద నీటి ప్రవాహం పెరుగుతుండటంతో తీర ప్రాంత ప్రజలను తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎస్ఐ సీసీ నాగార్జునరెడ్డిలు అప్రమత్తం చేశారు.
ఆర్డీఎస్కు జలకళ..
కోసిగిరూరల్: అగసనూరు సమీపంలోని రాజోలి బండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) జలకళను సంతరించుకుంది. ఆర్డీఎస్ ఆనకట్టపై నుంచి సుమారు 4 అడుగుల ఎత్తులో నీరు దిగువకు ప్రవహిస్తున్నాయి. వరద నీటిని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాయి రంగనాథ్ పరిశీలించారు. టీబీ డ్యాం నుంచి దిగువకు ఎక్కువగా నీరు వదిలే అవకాశం ఉన్నందున తీరప్రాంత గ్రామల ప్రజలు, జాలర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
జలమయమైన పొలాలు
కౌతాళం: తుంగభద్ర నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో మండలంలోని తీర ప్రాంత పొలాలు జలమయమయ్యాయి. విద్యుత్ మోటర్లు నీటమునిగాయి. మేళిగనూరు, వల్లూరు, కుంబళనూరు, మరళి, గుడికంబాల గ్రామాల్లో పత్తి, ఉల్లి పైర్లకు నష్టం వాటిల్లింది. ప్రతి ఏడాది తమకు ఇలాంటి పరిస్థితే ఎదురవుతోందని రైతులు తెలిపారు.