స్టాఫ్‌నర్స్‌కు కరోనా అవాస్తవం

6 Apr, 2020 07:48 IST|Sakshi
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎస్పీ సత్యయేసుబాబు, జేసీ డిల్లీరావు

ఆరుకు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

అందులో ఒకరు మృతి  

అధికారికంగా ప్రకటించిన కలెక్టర్‌  

సాక్షి, అనంతపురం: జిల్లాలో కొత్తగా మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. ఇందులో ఒకరు మృత్యువాత పడ్డారు. ఈ మేరకు ఆదివారం కలెక్టర్‌ గంధం చంద్రుడు అధికారికంగా తెలిపారు. కాగా ఆదివారం నమోదైన మూడు పాజిటివ్‌ కేసులు సైతం హిందూపురానికి చెందినవే కావడం గమనార్హం.  దీంతో కలెక్టర్‌ హిందూపురంలోని టిప్పు ఖాన్‌ స్ట్రీట్, హెచ్‌బీ కాలనీ, హస్నాబాద్, ముక్కిడిపేటతో పాటు లేపాక్షిని కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. ఈ ఐదు ప్రాంతాల్లోని ప్రజలు కొన్ని రోజుల పాటు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. (దేదీప్యమానంగా..)

48 మందికి పరీక్షలు.. 
వైద్య కళాశాలలోని వీఆర్‌డీఎల్‌లో 48 మందికి ఆదివారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అందులో కర్నూలు జిల్లాకు చెందిన వారు 33 ఉండగా.. అనంతపురం జిల్లాకు చెందిన వారు 15 మంది ఉన్నారు. మరోవైపు ఆదివారం సర్వజనాస్పత్రిలో కరోనా అనుమానిత లక్షణాలతో 15 మంది అడ్మిట్‌కాగా, ఆస్పత్రిలోని ఐసోలేషన్, క్వారన్‌టైన్‌ తదితర వార్డుల్లో  48 మంది ఉన్నారు.  కరోనా అనుమానిత, పాజిటివ్‌ వ్యక్తుల కాంటాక్ట్, కోవిడ్‌ ప్రాంతాల నుంచి వచ్చిన 56 మందిని జిల్లాలోని వివిధ క్వారన్‌టైన్‌ కేంద్రాలకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.(కరోనా భయం వీడండి )

జిల్లాను నాలుగు జోన్లుగా ఏర్పాటు చేయాలి 
అనంతపురం అర్బన్‌: జిల్లాను నాలుగు జోన్లుగా విభజించి ప్రొటోకాల్‌ ప్రకారం కరోనా బాధితులకు చికిత్సలు అందించేలా చూడాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ నుంచి అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లోని అన్ని ప్రాంతాలను గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్‌ జోన్‌లుగా ఏర్పాటు చేయాలన్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు ఉండే ప్రాంతం రెడ్‌ జోన్‌ పరిధిలోకి వస్తుందని, ఈ జోన్‌లో లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయాలన్నారు. వైద్యులకు షిఫ్ట్‌ వారీగా డ్యూటీ వేయాలని అధికారులను ఆదేశించారు.

కరోనా వైరస్‌ లక్షణాలున్నట్లు అనిపిస్తే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ నిర్ధారణ కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రి, హిందూపురం ప్రభుత్వాస్పత్రి, బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆ వివరాలను 8500292992, 08554–220009 నంబర్లకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చన్నారు. అంతకుముందు కలెక్టర్, ఎస్పీలు కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

స్టాఫ్‌నర్స్‌కు కరోనా అవాస్తవం.. 
అనంతపురం సర్వజనాస్పత్రిలో పనిచేస్తున్న స్టాఫ్‌నర్స్‌కు కరోనా సోకినట్లు సోషల్‌ మీడియాలో వచ్చిన వార్తలను కలెక్టర్‌ గంధం చంద్రుడు ఖండించారు. ఆమెకు కరోనా లేదని తేలి్చచెప్పారు. ఇలాంటి అవాస్తవాలను ప్రజలను నమ్మవద్దన్నారు.   

మరిన్ని వార్తలు