అదే హోరు

1 Oct, 2013 04:16 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : సింహపురివాసులు చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమం 62వ రోజైన సోమవారం హోరెత్తింది. నగరంలో విద్యార్థి జేఏసీ, ఉద్యోగ జేఏసీ, ఎన్‌జీఓ అసోసియేషన్లు నిరసన దీక్షలు కొనసాగించాయి. ఎన్‌జీఓ, విద్యార్థి జేఏసీ నేతలు నగరంలోని స్వర్ణాల చెరువులో సమైక్యాంధ్ర రొట్టెలు అందజేశారు. పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జలదంకిలో జనగర్జన జరి గింది. జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు ర్యాలీలు, రాస్తారోకోలు, నిరసన దీక్షలు, మానవహారాలు నిర్వహించారు.  
 
  వేదాయపాళెం సెంటర్‌లో ముది రాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. మండు టెండలో చిన్నారులు ముగ్గులేసి నిరసన తెలిపారు.  నీటిపారుదల శాఖ ఉద్యోగులు సోమవారం కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మహిళలు ఆటలు ఆడి నిరసస వ్యక్తం చేశారు.  
 
  మనుబోలులో సోమవారం ముస్లిం లు భారీ ప్రదర్శన నిర్వహించి, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పొదలకూరులో వీఆర్వోలు, తలారులు రిలే నిరాహారదీక్షలు చేశారు. ముత్తుకూరులో బీసీ సంక్షేమ సంఘం రెండోరోజు రిలేనిరాహారదీక్షలు చేశారు.
  ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకిలో సోమవారం జనగర్జన జరిగింది.
 
 కావలి ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వెయ్యి మీటర్ల జాతీయజెండా ప్రదర్శించారు. కలిగిరిలో మాంసం విక్రయదారులు రాస్తారోకో, వంటావార్పు నిర్వహించారు. కొండాపురం సాయిపేటలో వంటావార్పు, ర్యాలీ జరిగాయి. దుత్తలూరులో ఆటో యజమానుల ఆధ్వర్యంలో బంద్ పాటించారు.
 
 సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ప్రతినిధి కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి కావలి నుంచి శ్రీశైలానికి పాదయాత్ర ప్రారంభించారు. కావలి నుంచి రుద్రకోట జాతీయ రహదారి మీదుగా ప్రకాశం జిల్లాకు చేరుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో కావలి నుంచి ముసునూరు వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ, ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ, ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ, సమైక్యాంధ్ర జేఏసీల ఆధ్వర్యంలో రిలేనిరాహారదీక్షలు కొనసాగాయి.  

 వెంకటగిరిలో కాశీపేట సెంటర్‌లో పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో వీధులను శుభ్రపరిచారు.అనంతరం అక్కడే స్నానాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. సైదాపురంలో యూత్,ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న పోరును సాగించారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, శివాజీ వేషధారులు ఆకట్టుకున్నారు.
 
  గూడూరు రూరల్ పరిధిలోని చెన్నూరు నుంచి ప్రజలు పలు వాహనాల్లో గూడూరుకు తరలి వచ్చారు. టవర్‌క్లాక్ కూడలి ప్రాంతం వద్ద వినూత్న రీతిలో మగ్గం నేస్తూ  నిరసన వ్యక్తం చేశారు. అలాగే మహిశాశురమర్ధిని తదితర వేషధారణలో పలువురు తమ నిరసన వ్యక్తం చేశారు.
 
  కోవూరు ఎన్జీఓ హోంలో యువకుల దీక్ష చేపట్టారు. లేగుంటపాడులో మహిళల దీక్షలో కూర్చున్నారు. కొడవలూరు నార్తురాజుపాళెంలో ఉపాధ్యాయ జేఏసీ నాయకుల దీక్ష  కొనసాగుతోంది.
  ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో సమైక్యాంధ్రకు మద్దతుగా క్రైస్తవ సంఘాల సమాక్య రిలే నిరాహార దీక్షలో పాల్గొంది. పట్టణంలో మానవహారంగా ఏర్పడి కేసీఆర్ దిష్టిబొమ్మను టమోటాలతో కొట్టి దహనం చేశారు. ఎన్‌జీఓలు, జేఏసీ నేతలు వారికి సంఘీభావం తెలిపారు.
 

మరిన్ని వార్తలు