అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.20 వేల లోపు డిపాజిట్లు చెల్లింపు

27 Oct, 2019 03:45 IST|Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

అవసరమైన చర్యలు చేపట్టాలని డీజీపీ, సీఐడీ అధికారులకు ఆదేశాలు

వీలైనంత ఎక్కువ మంది బాధితులను ఆదుకోవాలని నిర్ణయం

సాక్షి అమరావతి:  అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.20 వేల లోపు డిపాజిట్లు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం ఇప్పటికే రూ.1,150 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. తొలుత రూ.263.99 కోట్లు విడుదల చేస్తూ అక్టోబర్‌ 18న ఉత్తర్వులిచ్చింది. తొలి దశలో రూ.10 వేలలోపు డిపాజిట్లు చెల్లించాలని భావించింది. అయితే, అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలంలో జాప్యం జరుగుతున్నందున రూ.20 వేల లోపు డిపాజిట్లు చెల్లించి, వీలైనంత ఎక్కువ మంది బాధితులను ఆదుకోవాలని నిర్ణయించింది.

ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ డీజీపీ, సీఐడీ అధికారులను ఆదేశిస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చింది. అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటామని పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజులకే బాధితులను ఆదుకునేలా మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. బాధితులకు చెల్లించడానికి రూ.1,150 కోట్లు కేటాయించారు.   

ఏమిటీ అగ్రిగోల్డ్‌? 
విజయవాడకు చెందిన అవ్వా వెంకటరామారావు, మరికొందరు కలిసి 1995లో ‘అగ్రిగోల్డ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌’ స్థాపించారు. ఏపీతోపాటు మరో ఏడు రాష్ట్రాల్లో ప్రజల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించారు. అధిక వడ్డీల ఆశ చూపించి, దాదాపు 32 లక్షల మంది నుంచి రూ.6,380 కోట్లు వసూలు చేశారు. వారికి భూములు ఇవ్వకపోగా, చెల్లించిన డిపాజిట్లు కూడా తిరిగి ఇవ్వలేదు. దీంతో బాధితులు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

అగ్రిగోల్డ్‌ సంస్థకు చెందిన భూములను విక్రయించి, తమకు డబ్బులు చెల్లించాలని గత టీడీపీ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఫలితం లేకపోవడంతో ఉద్య మాలు చేశారు. తాము అధికారంలోకి రాగానే డిపాజిట్లు చెల్లిస్తామని, బాధితులను ఆదుకుంటా మని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చి.. మాట నిలబెట్టుకుంటూ నిధులు కేటాయించారు.

మరిన్ని వార్తలు